
భీమదేవరపల్లి,వెలుగు: ములుకనూరు సొసైటీ సొసైటీ దేశానికి దిక్సూచీ లాంటిదని కలెక్టర్ చాహత్ బాజ్పేయ్ అన్నారు. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గోదాం, పత్తి పరిశ్రమ, విభాగాలను సందర్శించి అక్కడి పనులను పరిశీలించారు. తరువాత సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పవర్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అందుతున్న సేవలు, లాభాల వివరాలను తెలుసుకున్నారు.
సంఘం ఆధ్వర్యంలో 22 గ్రామాల్లో గోదాంలు ఏర్పాటు చేసి రైతుల ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ముల్కనూరు సంఘం నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. ముల్కనూరు మాదిరిగా ప్రతి మండలంలో ఇలాంటి సంఘాలు ఉంటే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జీఎం రామిరెడ్డి, ఏజీఎం సతీష్, ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, అడిషనల్ కలెక్టర్ రవి, డీసీఓ సంజీవరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీ పాల్గొన్నారు.