
టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసే ‘డార్లింగ్’ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంతలా అంటే ఆయన పాత సినిమాలు రీ-రిలీజ్ అయినా థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే, తాజాగా హైదరాబాద్లోని సుదర్శన్ 35MM థియేటర్ వద్ద జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రీ-రిలీజ్ హంగామా కాస్తా థియేటర్ సిబ్బందికి, అభిమానులకు మధ్య ఘర్షణకు దారితీసింది. అందిన సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన ఒక సినిమా రీ-రిలీజ్ సందర్భంగా ఈ గొడవ చోటు చేసుకుంది. సాధారణంగా రీ-రిలీజ్ సినిమాల్లో ఫ్యాన్స్ కోసం కొన్ని మాస్ సాంగ్స్ను రిపీట్ చేయడం లేదా ప్రత్యేకంగా ప్లే చేయడం జరుగుతుంటుంది. ఒక షోలో పాటలు వేసి, మరో షోలో వేయకపోవడంతో అక్కడున్న అభిమానులు థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. మా షోలో కూడా పాటలు వేయాల్సిందేనని పట్టుబట్టారు.
ఈ క్రమంలోనే ఒక అభిమాని అభ్యంతరం తెలపగా, థియేటర్ మేనేజ్మెంట్ సదరు వ్యక్తిపై దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు అభిమానిని సిబ్బంది కొట్టారని, ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఘటనపై మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. కేవలం పాటలు వేయమని అడిగినంత మాత్రాన మేనేజ్మెంట్ దాడి చేయదని, అక్కడ అభిమానులే ఏదైనా అతి చేసి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రీ-రిలీజ్ సమయాల్లో థియేటర్ సీట్లు చించేయడం, స్క్రీన్ల వద్ద బాణాసంచా కాల్చడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే వాగ్వాదం జరిగి ఉండవచ్చని, అభిమానుల ప్రవర్తన మితిమీరడం వల్లే గొడవ పెద్దదై ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. థియేటర్ వద్ద గందరగోళం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానిపై దాడి జరగడం నిజమైతే మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.