
- ఇప్పటికే రూ.కోటి ప్రమాద బీమా
- తాజాగా సహజమరణానికీ వర్తింపు
- రూ.8,906 ప్రీమియంతో రూ.50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్
హైదరాబాద్, వెలుగు : సింగరేణి కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి బీమా ఇప్పటికే అందజేస్తుండగా, ఇకపై సహజంగా మరణించినా వారి కుటుంబానికి సైతం రూ.10 లక్షలు అందనున్నాయి. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గురువారం అగ్రిమెంట్ చేసుకుంది.
సింగరేణి తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్బీఐలో శాలరీ అకౌంట్ కలిగిన సింగరేణి కార్మికులు, ఉద్యోగులందరికీ ‘గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం’ కింద ఈ ప్రయోజనం అందుతుంది. సింగరేణిలో పనిచేస్తున్న 40 వేల మంది ఉద్యోగులు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్కు అర్హులుకానున్నారు. ఎస్బీఐ ద్వారా 2021–22 నుంచి సింగరేణి కార్మిక, ఉద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం ఉండగా, ఇటీవల ఈ మొత్తాన్ని రూ. కోటికి పెంచారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సైతం ప్రమాదబీమా అందిస్తున్నారు. పదవీ విరమణ పొందిన కార్మికులకు 70 ఏండ్ల వరకు రూ.30 లక్షల బీమా స్కీమ్ వర్తిస్తోంది. ఇప్పటివరకు వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 50 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.30 కోట్లను ప్రమాద బీమా కింద చెల్లించినట్లు సింగరేణి ఆఫీసర్లు ప్రకటించారు.
సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంపై సింగరేణి తరఫున పర్సనల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ కిరణ్కుమార్, ఎస్బీఐ తరఫున డీజీఎం సీఎస్పీ నీలాక్షీ సింగ్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ టి. శ్రీనివాస్, పర్సనల్ డీజీఎం ముకుంద సత్యనారాయణ, ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, సీనియర్ అధికారి సురేశ్కుమార్ పాల్గొన్నారు.
రూ.50 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్
ఎస్బీఐలో కార్పొరేట్ శాలరీ ఖాతా కలిగిన సింగరేణి కార్మికులు, ఉద్యోగుల కుటుంబసభ్యులకు రూ.8,906 ప్రీమియం చెల్లిస్తే రూ. 50 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అందిస్తున్నట్లు ఎస్బీఐ డీజీఎం సీఎస్పీ నీలాక్షీ సింగ్ చెప్పారు. ఈ స్కీమ్ భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలకు వర్తిస్తుందన్నారు. సాధారణ ఆరోగ్య బీమా ప్రీమియంతో పోలిస్తే చాలా తక్కువ ప్రీమియంతోనే కార్పోరేట్ శాలరీ ఖాతాదారులకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ను అందిస్తున్నామన్నారు.
సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి బీమా అందించడంతో పాటు మృతుడి కుటుంబంలోని పిల్లలు 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఉంటే వారి చదువు కోసం అబ్బాయికి రూ.8 లక్షలు, అమ్మాయికి రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. వివాహ వయస్సు కలిగిన పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.5 లక్షల చొప్పున ఇద్దరికి కలిపి రూ.10 లక్షలు చెల్లిస్తున్నట్లు
వెల్లడించారు.