Reading Time: 2 minutes
Petrol Diesel Price: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. పెట్రోల్, డీజిల్ ధరలపై మరో కీలక ప్రకటన..

సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే చాలు, ధరల పెరుగుదలపై రకరకాల ఊహాగానాలు మొదలవుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో సామాన్యులు ఎప్పుడూ ఆందోళనగానే ఉంటారు. తాజాగా, ప్రస్తుతం జరుగుతున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇంధన ధరలు లీటరుకు సుమారు రూ. 25 నుంచి రూ. 28 వరకు భారీగా పెరుగుతాయని కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి మూసివేత ఇందుకు కారణాలంటూ ఆ వార్తల సారాంశం. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ, ఇదంతా కేవలం ‘ఫేక్ న్యూస్’ అని తేల్చి చెప్పింది.

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ(MoPNG) ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదా ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ లాంటి సంస్థలు ఇచ్చిన అంచనాలను తప్పుగా అర్థం చేసుకుని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ వార్తలను సృష్టించారని కేంద్రం మండిపడింది. పౌరులలో భయాందోళనలు కలిగించేలా ఇలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం దురదృష్టకరమని పేర్కొంది.

గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సామాన్యులపై భారం పడకుండా అనేక చర్యలు తీసుకున్నాయని ప్రభుత్వం గుర్తు చేసింది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, ఇంధన ధరల స్థిరీకరణ కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించింది. అలాగే గడిచిన నాలుగేళ్లలో భారత్ మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. కాబట్టి, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయ వార్తా సంస్థలను మాత్రమే అనుసరించాలని సూచించారు.

ఇది చదవండి: మీ భూమి కబ్జాకు గురైందా? ఆస్తిని తిరిగి దక్కించుకోవడం ఈజీ.. ఈ ఒక్క పని చేస్తే చాలు..