Reading Time: < 1 minute
Anantapur Honey Trap Case Ysrcp Leader Narender Reddy Detained

Anantapur Honey Trap Case: అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డిని పోలీసులు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హనీ ట్రాప్ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులతో నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ కాల్ డేటా, వాయిస్ రికార్డుల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్లు సమాచారం. కేసులో కొత్త ఆధారాలు బయటపడటంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై దృష్టి సారించారు.

Read Also: Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, నరేందర్ రెడ్డిని రేపు మీడియా ముందుకు తీసుకురావచ్చని తెలుస్తోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ పరిణామంతో అనంతపురం జిల్లాలో రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి. హనీ ట్రాప్ కేసులో మరిన్ని ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాగా, గత కొంతకాలంగా ప్రముఖులే టార్గెట్‌గా సాగుతున్న హనీట్రాప్‌ వ్యవహారం బట్టబయలైన విషయం విదితమే.. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందుతులను అరెస్ట్ చేశారు పోలీసులు.. కింగ్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటూ దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంత కుమారిని అరెస్ట్ చేశారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.. పోలీసులు చెబుతున్న ప్రకారం.. ప్లాన్‌ చేసి అమాయకులను, బాగా డబ్బున్నవాళ్లకు వల వేసి ట్రాప్ చేసేవారని.. ఆ తర్వాత బెదిరింపులకు దిగేవారని.. వారికి చాలా మంది బాధితులు లక్షలాది రూపాయలు సమర్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు.. ఇక, నిందితుల వద్ద నుంచి రూ.13 లక్షల నగదు, రెండు కత్తులు, అలాగే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..