
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హాస్యనటి గిరిజ జీవితం ఒక అందమైన కావ్యంలా మొదలై, కన్నీటి గాథగా ముగిసింది. అగ్ర హీరోలతో సమానంగా క్రేజ్, పారితోషికం అందుకున్న ఆమె ప్రస్థానం ‘బెంజి నుంచి గంజి వరకు’ అన్న సామెతను తలపిస్తుంది. మహానటి సావిత్రి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో, గిరిజ కథలోనూ అన్ని విషాద ఛాయలు కనిపిస్తాయి. 1936లో కంకిపాడులో జన్మించిన గిరిజ, 13 ఏళ్ల వయసులోనే మద్రాసులో అడుగుపెట్టారు. రేలంగితో ఆమెది ‘ఎవర్ గ్రీన్’ కాంబినేషన్. వీరిద్దరి కోసం ప్రత్యేకంగా కామెడీ ట్రాక్లు రాసేవారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. సుమారు 300 చిత్రాల్లో నటించిన ఆమె, పాతాళభైరవి లాంటి సినిమాలతో ప్రేక్షకులకు ఆరాధ్య నటిగా మారారు. నటిగా ఎంత సంపాదించినా, వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెను అగాధంలోకి నెట్టేశాయి.
శ్రీ సన్యాసిరాజును ప్రేమించి వివాహం చేసుకోవడం ఆమె జీవితంలో పెద్ద మలుపు. భర్తను నిర్మాతగా మార్చాలనే కోరికతో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. గిరిజ కుమార్తె సలీమా వెల్లడించిన నిజాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. భర్త చేతిలో భౌతిక హింసను భరించడమే కాకుండా, తన పేరును కరీమా బేగంగా మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాల వల్ల సొంత భవనాన్ని అమ్ముకుని అద్దె ఇంట్లోకి వెళ్లాల్సిన స్థితి వచ్చింది. ఆమె బస్టాండ్లో దిక్కులేని స్థితిలో చనిపోయారనే ప్రచారం అబద్ధమని, ఆమె ఇంట్లోనే ప్రశాంతంగా కన్నుమూశారని సలీమా స్పష్టం చేశారు. నేడు ఆమె వారసురాలు సలీమా మలయాళ, తమిళ చిత్రాల్లో నటిస్తూ తల్లి పేరును నిలబెడుతున్నారు.
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..