Reading Time: < 1 minute
Andhra Pradesh Heatwave Temperatures Cross 45c Red Alert Issued

AP Heatwave: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికలు జారీ చేస్తూ, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. నేడు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 382 మండలాల్లో 40 డిగ్రీలకు మించి గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండ, ఉక్కపోత, వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రేపటికి వడగాలుల హెచ్చరిక
రేపు అనగా శుక్రవారం రోజు రాష్ట్రంలోని 62 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 89 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ఎల్లుండి 7 మండలాల్లో తీవ్ర వడగాలులు, 31 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

ప్రధాన జిల్లాలకు రెడ్ అలర్ట్
శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం జిల్లాలో అత్యధిక మండలాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తృతంగా వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా వడగాలుల ప్రభావం ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 45.1 డిగ్రీలు, సాలూరులో 45.1 డిగ్రీలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీలు, రాజాంలో 44.5 డిగ్రీలు, కరపలో 44.4 డిగ్రీలు, కంభంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రజలకు సూచనలు
అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో నీడలో ఉండటం, తరచూ నీరు తాగడం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..