
అప్పు ఇచ్చేటప్పుడు ఉన్న ఆప్యాయత, తిరిగి అడిగేటప్పుడు ఉండదు. ఇది చాలా మంది రుణదాతలు ఎదుర్కొనే చేదు నిజం. ప్రామిసరీ నోటు రాసి ఇచ్చినా కూడా అప్పు చెల్లించకుండా తప్పించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, హైకోర్టు అడ్వకేట్ పావని ప్రామిసరీ నోటు న్యాయబద్ధత, అప్పు వసూలు మార్గాలపై అందించిన విషయాలు ఇలా ఉన్నాయి. ఒక ప్రామిసరీ నోటు చట్టబద్ధంగా చెల్లుబాటు కావాలంటే అందులో తేదీ, అప్పు మొత్తం, ఇరు పక్షాల వివరాలు, ముఖ్యంగా ఇద్దరు సాక్షుల సంతకాలు తప్పనిసరి. ఇవి సరిగ్గా ఉన్నప్పుడే న్యాయస్థానంలో ఆ డాక్యుమెంట్కు బలం ఉంటుంది. అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే, సివిల్ కోర్టులో ‘మనీ రికవరీ సూట్'(Order 7, Rule 1) ద్వారా కేసు వేసి మీ డబ్బును తిరిగి పొందవచ్చు.
చాలా మందికి తెలియని మరో విషయమేమిటంటే, ప్రామిసరీ నోటుకు కేవలం మూడేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. నోటు రాసిన తేదీ నుంచి మూడేళ్లు దాటితే అది చెల్లకుండా పోతుంది. అయితే, రుణగ్రహీత నుంచి చిన్న మొత్తాన్ని(ఉదాహరణకు 100 రూపాయలు) వసూలు చేసి, ఆ వివరాలను నోటు వెనుక రాసి సంతకం చేయించుకుంటే, ఆ తేదీ నుంచి మళ్లీ మరో మూడేళ్ల గడువు పెరుగుతుంది. ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయడం లేదా తీసుకోవడం ప్రమాదకరం. రుణదాతకు అంత డబ్బు ఇచ్చే స్తోమత ఉందా అని కోర్టు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి లావాదేవీ పారదర్శకంగా ఉండాలి. ఒకవేళ కోర్టు తీర్పు వచ్చినా అప్పు తీర్చకపోతే, రుణగ్రహీత ఆస్తులను జప్తు చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. అప్పు వసూలు కోసం దౌర్జన్యం చేయకుండా, చట్టబద్ధమైన మార్గాల్లోనే పోరాడాలని అడ్వకేట్ పావని సూచించారు.
ఇది చదవండి: W, W, W, W, W, W.. అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి పెవిలియన్ చేరారు..