Reading Time: 2 minutes
Off The Record About Tdp Senior Leaders Unhappy Over Party Developments In Visakhapatnam

Off The Record: తెలుగుదేశం పార్టీలో తరం మారుతోంది. అందుకు తగ్గట్టే ట్రెండ్‌ కూడా ఛేంజ్‌ అవుతోంది. అయితే… ఈ వ్యవహారాలు చాలామంది సీనియర్స్‌కు మింగుడు పడ్డం లేదట. మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వ్యవహారం కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేతలు సైతం మాకు పార్టీలో, ప్రభుత్వంలో కనీస విలువ లేదంటూ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 40 ఏళ్ళ పాటు జెండా మోసిన నేతలకు సైతం ఇక అవకాశాలు మూసుకుపోయినట్టేనని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీల కూర్పును చూస్తేనే ఈ విషయం అర్ధమవుతోందన్నది వాళ్ళ మాట. ఆ కమిటీల నియామకం విషయంలో విశాఖ సీనియర్స్‌ తీవ్ర మన స్తాపంతో వున్నట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం, వివిధ వర్గాల బ్యాలెన్సింగ్‌ అధిష్టానం ఇష్టమే అయినా…. ఆ బ్యాలెన్సింగ్‌లో మేం లేకపోతే… ఇన్నేళ్ళ లాయల్టీకి అర్ధం ఏముందన్నది కొందరి క్వశ్చన్‌. అందులోనూ సాంప్రదాయ రాజకీయాలకు కేరాఫ్ అయిన టీడీపీలో మొదట్నుంచి సీనియర్లకు సముచిత స్ధానం ఉంటుంది. పొలిటిబ్యూరోతోపాటు స్టేట్ కమిటీల్లో కీలకమైన పదవుల్ని ఎక్కువ అనుభవం ఉన్న వాళ్లకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఈసారి మాత్రం పూర్తిగా గతానికి భిన్నంగా జరిగిందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. విధాన నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరోలో మంత్రి వంగలపూడి అనితకు చాన్స్ దొరికితే….. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు రెండోసారి పల్లా శ్రీనివాస్‌కే దక్కాయి.

వీళ్ళిద్దర్ని మినహాయిస్తే చాలామంది సీనియర్ నేతలకు స్థానం దక్కలేదు. పార్టీ కమిటీల కూర్పులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, దాడి వీరభద్రరావు లాంటి వాళ్ళ పేర్లను హై కమాండ్ కనీసం పరిగణనలోకి తీసుకున్నట్టు కూడా కనిపించలేదంటున్నారు. దీంతో… దాదాపు మూడు దశాబ్దాలకుపైగా… పార్టీలో ఉన్న వాళ్ళను పక్కన పెట్టేసినట్టేనా అన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే… దశాబ్దం క్రితం టీడీపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనితకు అనూహ్యంగా రెండోసారి పొలిట్ బ్యూరోలో చాన్స్ దక్కింది. అయితే…అంతకంటే ముందు నుంచి, ఒక విధంగా చెప్పాలంటే పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు కేసులు ఎదుర్కొన్న చాలామందికి న్యాయం జరగలేదనే మాటలు సైతం వినిపిస్తున్నాయి. వరుసగా నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, సీనియర్ శాసనసభ్యుడు గణబాబుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇక పప్పల చలపతిరావు, గవిరెడ్డి రామానాయుడు, పీలా గోవింద సత్య నారాయణ, గండి బాబ్జి, గిడ్డి ఈశ్వరి, మణికుమారి వంటి వాళ్ళను అధినాయకత్వం పూర్తిగా పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోందని అంటున్నారు. అటు అధికారికంగా, ఇటూ పార్టీ పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీన్ని అవమానంగానే భావిస్తున్నామని సన్నిహితుల దగ్గర అంటున్నారట సీనియర్లు. ఈ పరిస్థితుల్లో భారీ మెజార్టీలతో గెలిచిన ఎమ్మెల్యేలకు సైతం ప్రభుత్వ యంత్రాంగం దగ్గర పరపతి లేకుండాపోతోందట. ఎమ్మెల్యే అంటే జస్ట్‌ ఎమ్మెల్యేనే… అంతకు మించి నథింగ్ అనేలా సీనియర్ ఆఫీసర్స్‌ వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందుకు తాజాగా జరిగిన సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్నే ఉదాహరణగా చెబుతున్నారు.

ఈ ఉత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన టిక్కెట్లకు భారీగా కోత పెట్టింది దేవాదాయశాఖ. అందరికీ నామ్ కే వాస్తే అన్నట్టు విదిలించేసి… అవి కూడా ఇష్టమైతే తీసుకోండి లేకుంటే మానండి అన్నట్టు వ్యవహరించారట. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటాశ్రీనివాస్ దీన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది చందనోత్సవానికి ఆయన డుమ్మా కొట్టడం వెనక ఇదే రీజన్‌ ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏటా ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాక క్రమం తప్పకుండా కుటుంబంతో సహా దర్శనానికి వెళతారు గంటా. కానీ… ఈసారి మాత్రం సరిగ్గా అదే రోజున తనకు వ్యక్తిగత పని ఉందంటూ హైదరాబాద్‌ వెళ్ళిపోవడాన్ని బట్టి చూస్తుంటే… మాజీ మంత్రి తన అసంతృప్తిని చెప్పకనే చెప్పేశారన్న చర్చ జరుగుతోంది. అటు మాడుగుల నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు తీరుపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్ధాయి అధికారులు పట్టించుకోరు, మీరు పనిచేయరు…. ఇదే పద్ధతి కొనసాగితే సీఎంకు కంప్లయింట్ చేస్తానంటూ హెచ్చరించే వరకు వెళ్ళారాయన. ఈ పరిస్ధితుల వెనుక అసలు కారణం ‘గుడ్ లుక్స్’ అన్నది పొలిటికల్‌ టాక్‌. అధినాయకత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయి పరిస్థితులను, పరిణామాలను అసెస్ చేసుకుంటోంది. ఆ క్రమంలోనే వివిధ కారణాలతో సీనియర్లను పక్కనబెట్టడం ఇప్పటికే మొదలైపోగా… దీన్ని తీవ్ర అవమానకరంగా భావిస్తున్నారట వాళ్ళు. అలాగని, గొంతెత్తి మాట్లాడే పరిస్ధితిలో ఎవరూ లేరు. అందికే చేసేదేం లేక…వాట్సాప్‌ కాల్స్‌లో పరస్పరం గోడు వెళ్ళబోసుకుంటున్నారట. డైరెక్ట్‌ కాల్స్‌లో మాట్లాడుకుంటే ఎవరైనా రికార్డ్‌ చేసే ప్రమాదం ఉందన్న భయంతో వాట్సాప్‌కే పరిమితమై…. ఇంత బతుకు బతికి అంటూ ఆ తర్వాత పాజ్‌ ఇస్తున్నారట పెద్దలు. ఈసంగతి తెలిసిన పార్టీ నాయకులే పాపం సీనియర్స్‌ అంటూ జాలి వాక్యాలు పలుకున్నారట.