Reading Time: < 1 minute
Karnataka Woman Elopes With Husbands Friend Whatsapp Status Viral

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు చాలా వేగంగా మారుతున్నాయి. నమ్మకమే పునాదిగా సాగాల్సిన వైవాహిక జీవితాలు.. వివాహేతర సంబంధాల వల్ల చిన్నాభిన్నం అవుతున్నాయి. ఒకప్పుడు స్నేహానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉండేవారు, కానీ ఇప్పుడు ప్రాణ స్నేహితుడి సంసారంలోనే చిచ్చు పెట్టే రకాలు ఎక్కువవుతున్నారు. ఆకర్షణల కోసం కట్టుకున్న భర్తను, నమ్మిన స్నేహితుడిని మోసం చేస్తూ అనేక మంది జీవితాలను రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కుటుంబ వ్యవస్థలోని పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. అంతే కాకుండా.. సామాజికంగా ఎన్నో విమర్శలకు దారితీస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో వెలుగుచూసిన ఒక ఘటన సినిమా కథను తలపిస్తోంది.

అసలేం జరిగింది..

కర్ణాటకలోని మండ్య జిల్లా బన్నంగాడి గ్రామానికి చెందిన రక్షిత (24), రెండేళ్ల క్రితం సాగర్ అనే ఆటో డ్రైవర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సాగర్ తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అయితే.. సాగర్‌కు ఇంద్ర అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతడు కూడా ఆటో డ్రైవరే. స్నేహితుడు కదా అని సాగర్ తన స్నేహితుడిని ఇంటికి తీసుకువస్తుండేవాడు. ఆ పరిచయమే రక్షిత, ఇంద్ర మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.

వాట్సాప్ స్టేటస్‌తో షాక్..

భర్త ఇంట్లో లేని సమయం చూసి రక్షిత, ఇంద్రతో కలిసి పారిపోయింది. అంతటితో ఆగకుండా ఒక దేవాలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇంద్ర తన కాలికి మెట్టెలు పెడుతుండగా తీసుకున్న ఫోటోను రక్షిత ఏకంగా తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టింది. అది చూసిన భర్త సాగర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

తన భార్య పారిపోయే సమయంలో ఇంట్లోని రూ. లక్ష నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా తీసుకువెళ్లిందని సాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రక్షిత మాత్రం ‘నా భర్త నన్ను కొడుతున్నాడు, అందుకే వచ్చేశాను’ అని చెబుతోంది. ‘ఆమె ఎవరితో ఉన్నా నాకు సంబంధం లేదు, కానీ నా కష్టార్జితమైన నగదు, బంగారం వెనక్కి ఇచ్చేసి, నాకు విడాకులు ఇప్పించండి’ అని సాగర్ పోలీసులను కోరుతున్నాడు. ప్రస్తుతం ఈ వింత ప్రేమ కథ మండ్య జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.