Reading Time: < 1 minute
Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..? ఎంతంటే..?

త్వరలో వాహనదారులకు షాక్ తగలనుందా..? పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా..? అంటే అవునునే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్, డీజల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ ఉత్పత్తి చేసేందుకు ఇంధన కంపెనీలకు ఖర్చు ఎక్కువవుతోంది. ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకపోవడం వల్ల కంపెనీలపై భారం పడుతోంది. దీంతో పెట్రోల్ ధరలను పెంచడం అనివార్యంగా తెలుస్తోంది.

లీటర్‌పై ఎంత పెంచుతారంటే..?

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో కేంద్రం ధరల పెంపుపై వెనక్కి తగ్గింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ధరలు పెంచలేదు. అయితే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పెంపు ఉంటుందని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. లీటర్‌పై ఏకంగా రూ.25 నుంచి రూ.28 వరకు పెరగవచ్చని తన రిపోర్టులో తెలిపింది. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం వంటి కారణాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో పెరిగాయి. దీంతో ఆయిలు కంపెనీలపై భారం పడుతుందని, నెలకు రూ.27 వేల కోట్ల భారం పడుతుందని వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో ధరలను పెంచకపోతే కంపెనీలు నష్టపోయే అవకాశముంది. దీంతో భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుందని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ స్పష్టం చేసింది.

పవర్ పెట్రోల్ ధర పెంపు

ఇప్పటికే కేంద్రం పవర్ పెట్రోల్ ధరలను పెంచింది. అలాగే వాణిజ్య డీజిల్ ధరలను పెంచింది. ఇక ఆయిల్ కంపెనీలకు నష్టం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైంజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై ఎక్సైంజ్ ట్యాక్స్‌ను సున్నాకు తగ్గించింది. ఇది కొంతమేరకు కంపెనీలకు భారాన్ని తగ్గించినప్పటికీ.. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో చమురు సరఫరా నిలిచిపోయింది. దీని వల్ల ఆయిల్ దిగుమతులకు ఆటంకం కలుగుతోంది.