
తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రత, మితిమీరిన ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్న తరుణంలో.. ప్రకృతి కాస్త చల్లని కబురు మోసుకొచ్చింది. ఆకాశంలో అకస్మాత్తుగా మారుతున్న వాతావరణం ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆశించినప్పటికీ.. అది తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన ప్రమాదకర హెచ్చరికగా మారింది. వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం.. రాబోయే కొన్ని గంటలు రాష్ట్రంలోని పలు జిల్లాలకు కీలకం కానున్నాయి. ఎండల నుంచి ఉపశమనం లభించినా, వడగళ్ల వాన రూపంలో పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వడగళ్ల వాన బీభత్సం
తెలంగాణ వాతావరణ శాఖ (IMD) తాజా బులిటెన్ ప్రకారం.. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ప్రధానంగా హెచ్చరించారు. ముఖ్యంగా మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల , కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం తీవ్రంగా ఉండనుంది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు భారీ వేగంతో వీచే గాలులు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మేఘాలు క్రమంగా కదులుతూ కామారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు విస్తరించనున్నాయి. వడగళ్ల వాన వల్ల పంట నష్టంతో పాటు, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది. పాత భవనాలు, రేకుల షెడ్లలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.