Reading Time: < 1 minute
A.V.Ranganath: కన్నీటి కథలు విన్న తరువాత..హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ రియాక్షన్ ఇదే

హైదరాబాద్‌లో HYDRA చేపడుతున్న కూల్చివేతల డ్రైవ్‌పై ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆక్రందనలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ టీవీ9 క్రాస్‌ఫైర్ కార్యక్రమంలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కూల్చివేతలను చాలా భారీ స్థాయిలో చేస్తున్నారన్న ప్రజల అంచనాను ఆయన ఖండించారు. మొత్తం మీద 150 నుంచి 200 తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే తొలగించినట్లు స్పష్టం చేశారు. కూల్చివేతల వల్ల ఎదురవుతున్న భావోద్వేగ పరిస్థితిపై ప్రశ్నించగా, తాను ఒక మానవతా దృక్పథం కలిగిన అధికారిని అని, ప్రజల బాధను అర్థం చేసుకోగలనని రంగనాథ్ అన్నారు. అయితే, అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కొంత మంది ఇబ్బందులు పడక తప్పదని, ఇది కొత్త కాదని గతంలో కొతగూడెంలో రోడ్డు విస్తరణ పనుల సమయంలోనూ ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు. అభివృద్ధికి భయపడి వెనకడుగు వేస్తే సమాజం ముందుకు వెళ్లదని ఆయన అన్నారు. పేదల ముసుగులో నిజమైన కబ్జాదారులు ఉన్నారని, వీరే తమ పనులు చేయించుకోవడానికి పేదలను ముందుకు పంపుతున్నారని రంగనాథ్ ఆరోపించారు. చట్టం పట్ల ప్రజలకు గౌరవం, కొంత భయం ఉండాలని, అప్పుడే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.