Reading Time: < 1 minute
Karimnagar Granite Industry Crisis War Impact Exports

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తెలంగాణలోని కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వెళ్లే నాణ్యమైన గ్రానైట్‌కు చైనా, హాంగ్ కాంగ్, తైవాన్ , యూరప్ దేశాల్లో భారీ డిమాండ్ ఉండేది. అయితే, గత కొన్నేళ్లుగా కరోనా అనంతర మాంద్యంతో సతమతమవుతున్న ఈ పరిశ్రమపై, ఇప్పుడు పశ్చిమాసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్) నెలకొన్న యుద్ధ పరిస్థితులు కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా మార్గాల్లో ఏర్పడిన ఆటంకాలు, పెరిగిన చమురు ధరలు ఈ పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ముఖ్యంగా కరీంనగర్ నుండి యూరప్ దేశాలకు, అందునా ఇటలీకి వెళ్లే గ్రానైట్ ఎగుమతులు యుద్ధం వల్ల దాదాపుగా నిలిచిపోయాయి. చైనా వంటి దేశాలకు ఎగుమతులు కొనసాగుతున్నప్పటికీ, షిప్పింగ్ ఛార్జీలు భారీగా పెరగడం వ్యాపారులకు భారంగా మారింది. గతంలో ఒక కంటైనర్‌కు 21 డాలర్లుగా ఉన్న ఛార్జీలు ప్రస్తుతం 28 డాలర్లకు చేరడంతో, విదేశీ కొనుగోలుదారులు సరుకు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. దీనికి తోడు యుద్ధ ప్రభావంతో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడి రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా, క్వారీల్లో వాడే యంత్ర పరికరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో 250 రూపాయలు ఉన్న డ్రిల్లింగ్ బిట్టు ధర ఇప్పుడు ఏకంగా 1200 రూపాయలకు చేరడం పరిశ్రమ దీనస్థితికి అద్దం పడుతోంది.

మరోవైపు, క్వారీలను నడపడానికి అత్యంత కీలకమైన డీజిల్ సరఫరాపై కూడా ఆందోళన నెలకొంది. ప్రతి క్వారీకి రోజుకు సగటున 1000 లీటర్ల డీజిల్ అవసరం కాగా, ఒకవేళ ప్రభుత్వం డీజిల్ సరఫరాపై రేషన్ విధిస్తే ఉత్పత్తి 50 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని యజమానులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో గ్రానైట్ కటింగ్ , పాలిషింగ్‌కు ఇది అత్యంత అనువైన సమయం. వర్షాకాలం మొదలైతే పనులు మందగిస్తాయి, కాబట్టి ఈ మూడు నెలల సీజన్‌లోనే పనులు ఆగిపోతే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి డీజిల్ సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని, ఈ సంక్షోభం నుండి పరిశ్రమను గట్టెక్కించేందుకు రాయితీలు ప్రకటించాలని కరీంనగర్ గ్రానైట్ యజమానులు కోరుతున్నారు.