
వనపర్తి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మించుకోని వారిని ఒప్పించి ఇల్లు త్వరగా కట్టుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినప్పటికీ ఇంకా కొంతమంది నిర్మాణం ప్రారంభించలేదన్నారు. డబ్బులు లేని నిరుపేదలకు స్వయం సహాయక సంఘాల నుంచి బ్యాంకు రుణం ఇప్పించాలని సూచించారు.
ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంజూరు చేసిన అంగన్వాడీ భవనాలు, వీఓ భవనాలు, గోదాము నిర్మాణలకు స్థలం గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సర్ప్రక్రియ సజావుగా సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఖీమ్యా నాయక్, వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, పీడీ హౌజింగ్ విఠోబా పాల్గొన్నారు.