Reading Time: 2 minutes
Asia Cup 2026: 44 పరుగులకే 5 వికెట్లు పడినా అద్భుత విజయం.. సెమీస్‌కు చేరిన లంక.. సస్పెన్స్‌లో పాక్

Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో శ్రీలంక జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా నిలిచింది. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. కెప్టెన్ చమారి అటాపట్టు కేవలం ఒక పరుగుకే అవుట్ కాగా, పవర్ ప్లే ముగిసేసరికి లంక ముఖ్యమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత మరో రెండు వికెట్లు వెంటవెంటే పడిపోవడంతో ఓవర్ల వ్యవధిలోనే 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పకడ్బందీగా ఉన్న బంగ్లా బౌలింగ్ ఎదుట లొంగిపోయేలా కనిపించింది. ఆ సమయంలో లంక ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ఐదో స్థానంలో వచ్చిన హర్షిత సమరవిక్రమ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది.

హర్షిత సమరవిక్రమ అద్భుతమైన ఇన్నింగ్స్

జట్టును గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న హర్షిత చివరి వరకు క్రీజులో నిలబడి పోరాడింది. నీలాక్షిక డి సిల్వాతో కలిసి ఆరో వికెట్‌కు విలువైన 38 పరుగులు జోడించి ఆశలు చిగురింపజేసింది. ఆఖరి 3 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సి ఉండగా 18వ ఓవర్‌లో 16 పరుగులు, 19వ ఓవర్‌లో 11 పరుగులు రాబట్టి విజయాన్ని ఖాయం చేసింది. కేవలం 48 పరుగులతో అజేయంగా నిలిచి లంకకు నాటకీయ విజయాన్ని అందించిన హర్షిత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ గెలుపుతో గ్రూప్ బి నుంచి లంక హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ మెట్టుెక్కింది.

సెమీఫైనల్ పోరు వివరాలు.. పాక్ పరిస్థితి ఏంటి?

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి పాకిస్థాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్‌లపై వరుస విజయాలతో ఘనంగా సెమీఫైనల్స్ చేరింది. సెప్టెంబర్ 10న జరగనున్న తొలి సెమీఫైనల్‌లో గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ తలపడనుంది. ఈ స్థానాన్ని బంగ్లాదేశ్ కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 11న జరిగే రెండో సెమీఫైనల్‌లో శ్రీలంక జట్టు గ్రూప్ ఏలోని రెండో స్థానపు జట్టుతో పోటీపడుతుంది. పాకిస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడిస్తేనే సెమీస్ బెర్త్ దక్కించుకునే వెసులుబాటు ఉంది.

రసవత్తరంగా ఆసియా కప్ నాకౌట్ దశ

గ్రూప్ దశ ముగింపునకు రావడంతో టోర్నీ వాతావరణం వేడెక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తిరుగులేని శక్తిగా కనిపిస్తోంది. మరోవైపు క్లిష్ట పరిస్థితుల నుంచి పుంజుకుని సెమీస్ చేరిన శ్రీలంక కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. చివరి రెండు సెమీస్ స్థానాలపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..