
మేనరికపు పెళ్లిళ్లపై రెండు రకాల అభిప్రాయాలున్నాయి. మేనరికపు పెళ్లిళ్లు చేసుకుంటే పుట్టే పిల్లల్లో జన్యు సంబంధ సమస్యలు వస్తాయని.. పుట్టుకతోనే ఏదో ఒక లోపంతో పుడతారనే అభిప్రాయం ఉంది. కానీ.. మేనరికపు పెళ్లిళ్లు చేసుకునే ప్రతీ జంటకు ఇలానే జరుగుతుందనడానికి ఆధారాలు లేవు.
ఈ మధ్య ఇన్ స్టాగ్రాంలో మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవద్దని ఒక మహిళ ఏడుస్తూ చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో.. మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల ఇబ్బందులున్నాయా..? లేక అవన్నీ అపోహలేనా..? అనే చర్చ మొదలైంది.
మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్న అందరూ కాదు గానీ కొందరు మాత్రం పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. పుట్టుకతోనే ఇమ్యూనిటీ సిస్టమ్లో వచ్చే జన్యుపరమైన అరుదైన లోపాలే దీనికి కారణం కావొచ్చు. దీనినే మెడికల్ ల్యాంగ్వేజ్ లో ఇన్ బార్న్ ఎర్రర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ (ఐఈఐ) అంటారు. సాధారణ ఇన్ఫెక్షన్లే కదా అని నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేపట్టిన అధ్యయనంలో ఈ ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మేనరికపు వివాహాలు చేసుకున్నవారు తప్పనిసరిగా జెనెటిక్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. పుట్టగానే రక్తం ద్వారా స్క్రీనింగ్ చేయాలి. యాంటీబాడీ లోపం ఉన్నవారికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ) ఇస్తే మరణాల ముప్పు సగానికి పైగా తగ్గుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి బోన్ మ్యారో, హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ (హెచ్ఎస్ సీటీ) వంటి మూలకణ మార్పిడి చికిత్స చేయించుకున్న 90 మందిలో 80 మంది ప్రాణాలతో ఆరోగ్యంగా బయటపడ్డారు.
మన శరీరంలో రోగాలతో పోరాడే ఇమ్యూనిటీ సిస్టమ్ పుట్టుకతోనే లోపించడాన్ని ఇన్ బార్న్ ఎర్రర్స్ ఆఫ్ ఇమ్యూనిటీ (ఐఈఐ) లేదా ప్రైమరీ ఇమ్యునో డెఫిషియెన్సీ అంటారు. ఇవి అరుదైన జన్యు వ్యాధులు. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ తయారీకి అవసరమైన సుమారు 504 రకాల జన్యువుల్లో కలిగే మార్పుల వల్ల 555 రకాల ఇమ్యూనిటీ లోపాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే కణాలు తగ్గిపోతాయి. నేషనల్ రిజిస్ట్రీ ఫర్ రేర్ అండ్ అదర్ ఇన్ హెరిటెడ్ డిజార్డర్స్(ఎన్ఆర్ఆర్ఓఐడీ).. రిజిస్ట్రీలోని 676 కేసులను పరిశీలిస్తే.. అత్యధికంగా 27.6% మందికి సెల్యులార్, హ్యూమరల్ ఇమ్యూనిటీ లోపాలు ఉండగా.. 21.6% మందికి యాంటీబాడీ లోపాలు ఉన్నట్లు తేల్చారు.
►ALSO READ | రూ.20 వడా పావ్ కోసం… 15 వేలు ఖర్చు చేసి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్ళింది..! ఒక వర్గానికి మీరు ఆదర్శం మేడం..!
ఈ వ్యాధి బారినపడి మరణించడానికి కొన్ని కారణాలను రిపోర్టు వెల్లడించింది. స్టడీలో 22.9 శాతం కేసుల్లో తల్లిదండ్రులు మేనరికపు పెళ్లిళ్లు చేసుకున్నవారేనని తేలింది. వీరిలో పుట్టే పిల్లలకు మరణించే ముప్పు 2.76 రెట్లు ఎక్కువగా ఉంటోంది. వయసుకు తగ్గ బరువు పెరగని పిల్లలకు 2.65 రెట్లు ప్రాణాపాయం ఎక్కువ. హిమోగ్లోబిన్ 10g/dL కన్నా తక్కువ ఉన్న పిల్లలకు 2.45 రెట్లు ఎక్కువ రిస్క్ ఉందని స్టడీ స్పష్టం చేసింది.
అయితే, దేశంలో ఐవీఐజీ మందుల డిమాండ్కు తగ్గ సప్లై లేదు. పైగా వీటి రేట్లు చాలా ఎక్కువ. నేషనల్ రేర్ డిసీజ్ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఈ ఖరీదైన మందులను సామాన్యులకు ఉచితంగా, అన్ని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంచాలని పరిశోధకులు కోరుతున్నారు.