
Mohsin Naqvi To Attend Women’s Asia Cup 2026 Final: మహిళల ఆసియా కప్ 2026లో మరోసారి ట్రోఫీ అందజేత అంశం వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ సెప్టెంబర్ 13న జరగనున్న మహిళల ఆసియా కప్ ఫైనల్కు హాజరుకానున్నట్లు సమాచారం. ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ట్రోఫీ అందజేయనున్నట్లు తెలుస్తోంది.
మహిళల ఆసియా కప్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. టోర్నీలో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా ఫైనల్ చేరి టైటిల్ గెలిస్తే.. ట్రోఫీని మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా స్వీకరిస్తారా? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల భారత్, పాకిస్థాన్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్లోనూ ప్లేయర్స్ హ్యాండ్షేక్లు ఇచ్చుకోలేదు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, పాకిస్థాన్ కెప్టెన్ సనా మీర్ పరస్పరం హ్యాండ్షేక్ ఇచ్చుకోకపోవడంతో చర్చనీయాంశమైంది. దీంతో ఫైనల్లో ట్రోఫీ ప్రదానం సందర్భంగా కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడనుంది.
2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్ అనంతరం ట్రోఫీ అందించే విషయంలో తీవ్ర వివాదం చోటుచేసుకుంది. పాకిస్థాన్ను ఓడించి టైటిల్ గెలిచిన టీమిండియాకు ట్రోఫీని అందజేయడానికి మోహ్సిన్ నఖ్వీ పోడియం వద్ద వేచి ఉన్నాడు. అయితే అప్పటి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా భారత ఆటగాళ్లు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ పరిణామంతో అసంతృప్తికి గురైన నఖ్వీ వేడుకను మధ్యలోనే వదిలి ట్రోఫీని స్టేడియం నుంచి తీసుకెళ్లాడు. అనంతరం ఆ ట్రోఫీని దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. ఇప్పటివరకు అది భారత జట్టుకు అందలేదు.
ఈ వ్యవహారంపై బీసీసీఐ, ఏసీసీ మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. దీంతో మహిళల ఆసియా కప్ ఫైనల్కు జిత్తులమారి మోహ్సిన్ నఖ్వీ హాజరు కావడం మరోసారి ఆసక్తిని పెంచుతోంది. భారత మహిళల జట్టు ఫైనల్కు చేరుకుని టైటిల్ను గెలుచుకుంటే ట్రోఫీ అందజేత సమయంలో ఏం జరుగుతుందనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. గతంలో పురుషుల ఆసియా కప్లో జరిగిన ఘటన పునరావృతం కాకుండా నిర్వాహకులు ముందుగానే ఏర్పాట్లు చేస్తారా?.. లేదా మళ్లీ ట్రోఫీ విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతుందా? అన్నది చూడాలి.