Reading Time: 2 minutes
Rains: తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న వర్షాల జోరు.. వాతావరణశాఖ నుంచి చల్లని కబురు.. రాబోయే రెండ్రోజులు జాగ్రత్త..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు కురుస్తుండగా.. నేడు, రేపు కూడా ఇవి కొనసాగే అవకాశముందని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు విస్తారంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 11,12వ తేదీల తర్వాత తెలంగాణలో వర్షాలు మళ్లీ పుంజుకునే అవకాశముందని తెలిపింది. సెప్టెంబర్ మూడో వారం నుంచి వర్షాలు భారీగా పడే ఛాన్స్ ఉందని, సెప్టెంబర్ నాలుగో వారం వరకు ఇవి కొనసాగే అవకాశముందని స్పష్టం చేసింది. ఆరు నుంచి ఏడు రోజుల పాటు విస్తరంగా వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక మిగిలిన రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో పడతాయని పేర్కొంది.

వాతావరణశాఖ చల్లని కబురు

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు వానలు పడుతుండటంతో చల్లని కబురు అందినట్లు అయింది. నేడు, రేపు వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మహబూబాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి చ నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. అటు హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం పడుతోంది. ఈ వర్షాలు మరో కొద్ది రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మరికొన్ని రోజలు పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశముందని చెబుతున్నారు. ద్రోణులు, ఉపరితల ఆవర్తనాల్లో కదలికలు కనిపిస్తే వర్షాల జోరు మరింత పెరుగుతుందని తెలిపింది.

ఏపీకి వర్షసూచన

ఏపీకి అమరావతి వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోెయే మూడ్రోజుల పాటు వానలు కొనసాగుతాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలుచోట్ల పిడుగులు కూడా పడతాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి.