Reading Time: 3 minutes
Arshdeep Singh Concedes 51 Runs In 4 Overs India Star Under Scrutiny

Arshdeep Singh Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ అర్ష్‌దీప్ సింగ్‌ ఇటీవలి కాలంలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అంతర్జాతీయ టీ20లో భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్ అయిన అర్ష్‌దీప్.. ఐపీఎల్ 2026 సహా ఇటీవల టీమిండియా తరఫున కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా ఓ స్థానిక టీ20 లీగ్‌లో కూడా భారీగా రన్స్ ఇచ్చాడు. షేర్-ఎ-పంజాబ్ టీ20 కప్‌ 2026లో భాగంగా లూధియానా లయన్స్, ఫజిల్కా ఫాల్కన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ అత్యంత చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.

4 ఓవర్లలో 51 పరుగులు:

లూధియానా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అర్ష్‌దీప్ సింగ్‌.. తన నాలుగు ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. అర్ష్‌దీప్ భారీగా రన్స్ ఇచ్చినా.. ఫజిల్కా ఫాల్కన్స్‌ను 170 పరుగులకే పరిమితం చేయడంలో లెగ్‌స్పిన్నర్ కార్తీక్ చడ్డా కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఫజిల్కా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (21 బంతుల్లో 40 పరుగులు) కార్తీక్‌ అవుట్ చేశాడు. కార్తీక్ అద్భుతంగా బౌలింగ్ చేసిన అదే పిచ్‌పై అర్ష్‌దీప్ తేలిపోయాడు.

దంచికొట్టిన లోకల్ ప్లేయర్స్:
ఒక దశలో ఫజిల్కా ఫాల్కన్స్‌ 112/7తో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కానీ ఇన్నింగ్స్‌ చివర్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఫజిల్కా బ్యాటర్లు పరుగులు రాబట్టారు. అర్ష్‌దీప్‌ ఓవర్‌లో 18 పరుగులు పిండుకున్నారు. లోకల్ ప్లేయర్స్ ప్రేరిత్ దత్తా 23 బంతుల్లో 36 పరుగులు, జైవీర్ భిందర్ 18 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ఫజిల్కా 170/9 స్కోరును నమోదు చేసింది. లోకల్ ప్లేయర్స్ దంచికొట్టడంతో అర్ష్‌దీప్‌ 0/51 గణాంకాలతో ముగించాడు. ఐపీఎల్ 2026లో లక్నోపై అర్ష్‌దీప్ కేవలం 3 ఓవర్లలోనే 51 పరుగులు సమర్పించుకున్నాడు. మరోసారి భారీగా రన్స్ ఇవ్వడంతో అర్ష్‌దీప్‌ బౌలింగ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అర్ష్‌దీప్‌ రీల్స్ మానేస్తే బెటర్, అర్ష్‌దీప్ తన ఆటను మెరుగుపరుచుకోవడం తప్ప మిగిలిన పనులన్నీ చేస్తున్నాడు, ఇక టీమిండియాలో చోటు కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుని:
లూధియానా లయన్స్‌ జట్టుకు ఛేదనలోనూ సరైన ఆరంభం దక్కలేదు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 77/4తో నిలిచింది. కెప్టెన్ అర్ష్‌దీప్‌ తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకుని ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగాడు. 9 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి ప్రేరిత్ దత్తా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. మాధవ్ సింగ్ పఠానియా చివరి వరకు పోరాడుతూ.. 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్‌లో లూధియానాకు 19 పరుగులు అవసరం కాగా.. మాధవ్ వరుసగా బౌండరీలు బాదడంతో సమీకరణం చివరి బంతికి 6 పరుగులుగా మారింది. అయితే చివరి బంతికి బౌండరీ మాత్రమే రావడంతో లూధియానా లక్ష్యానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఫజిల్కా కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది.