
Asha Bhosle Last Song: భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న దిగ్గజ గాయని ఆశా భోంస్లే అభిమానులకు మరోసారి తన స్వరంతో పలకరించబోతున్నారు. ఆమె చివరిగా రికార్డ్ చేసిన సినిమా పాటను ఆమె జయంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ‘ఓం కా హరి’ చిత్రబృందం ప్రకటించింది. 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఈ పాట ఇప్పుడు ఆమె సంగీత వారసత్వానికి ప్రత్యేక నివాళిగా నిలవనుంది. ‘ఏ మేరీ జిందగీ, తూ చుపీ హై కహాన్’ లిరిక్ తో రూపొందిన ఈ పాటను సెప్టెంబర్ 8న విడుదల చేయనున్నారు. ఆశా భోంస్లే 2023 చివర్లో ఈ పాటను రికార్డ్ చేశారు. అప్పటికి ఆమె వయసు 90 ఏళ్లు. తాజాగా ఈ పాటను హరీష్ వ్యాస్ దర్శకత్వం వహించిన డ్రామా కామెడీ చిత్రం ‘ఓం కా హరి’లో ఉపయోగించినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఏడు దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత ప్రపంచాన్ని తన గాత్రంతో అలరించిన ఆశా భోంస్లే వేలాది పాటలను ఆలపించారు. ఆమె కెరీర్లో ‘దమ్ మారో దమ్’, ‘పియా తు అబ్ తో ఆజా’, ‘చురా లియా హై తుమ్నే జో దిల్ కో’, ‘యే మేరా దిల్’ వంటి ఎన్నో పాటలు తరతరాల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. దాదాపు 12 వేల పాటలను ఆలపించన ఈ స్వరం ఈ ఏడాది ఏప్రిల్లో 92 ఏళ్ల వయసులో మూగబోయింది. గాన కోకిల ఆశా భోంస్లే 2026 ఏప్రిల్ 12న 92వ వయసులో గుండెపోటు కారణంగా కన్నుమూశారు. మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆమె గాత్రంతో ప్రేక్షకుల హృదయాలలో ఇంకా జీవించే ఉన్నారు ఆశా భోంస్లే.
అయితే ‘ఓం కా హరి’ (Om Ka Hari) సినిమాతో ఆమె ఆఖరి పాట వినే భాగ్యం మళ్ళీ అభిమానులకు దక్కబోతోంది. ప్రస్తుతానికి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అన్షుమన్ ఝా, రఘుబీర్ యాదవ్ ప్రధాన పాత్రల్లో హరీష్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఇంకా ప్రకటించనప్పటికీ, థియేట్రికల్ రిలీజ్కు ముందే ఆమె జయంతి సందర్భంగా 2026 సెప్టెంబర్ 8న ఈ చివరి పాటను విడిగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దర్శకుడు హరీష్ వ్యాస్ మాట్లాడుతూ ఆశా భోంస్లే కాలాతీతమైన గాత్రానికి, ఆమె అపారమైన సంగీత వారసత్వానికి నివాళిగా ఈ పాటను ఆమె పుట్టినరోజున విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆమె సంగీతం ద్వారా ప్రభావితమైన తరతరాల శ్రోతలకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఇక ‘ఓం కా హరి’ కథ విషయానికి వస్తే.. ఒక రిటైర్డ్ జ్యోతిష్కుడైన తండ్రి (రఘుబీర్ యాదవ్) అతని కుమారుడు ఓమ్ (అన్షుమన్ ఝా) మధ్య సాగే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా. ఒక రోజు తండ్రికి గుండెపోటు వచ్చిన తర్వాత, జ్యోతిష్య లెక్కల ప్రకారం తనకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఆయుష్షు మిగిలి ఉందని గ్రహించి, తన చివరి శ్వాసను కాశీలో విడవాలని కోరుకుంటాడు. ఈ క్రమంలో చాలా కాలంగా మనస్పర్థతో దూరంగా ఉంటున్న కొడుకుతో కలిసి ఆయన చేసే కాశీ ప్రయాణం, వారి మధ్య ఉన్న పాత వైరం తుడిచేసి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకునేలా చేసిందనేదే ఈ మూవీ ప్రధాన కథాంశం. ఇందులో ఒక దిగ్గజ గాయని చివరిగా రికార్డ్ చేసిన పాట ఉండటంతో తండ్రి కొడుకుల మధ్య చెప్పుకోలేని ప్రేమను, జీవితాన్ని ఆస్వాదించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే భావోద్వేగ గీతంగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఆశా భోంస్లే జయంతి రోజున ఆమె స్వరం మరోసారి వినిపించనుండటంతో అభిమానులకు ఇది నిజంగా ప్రత్యేకమైన సంగీత కానుకగా మారనుంది.