
Sonal Dinusha on 3 Centuries vs India: శ్రీలంక, భారత్ మధ్య కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఓ దశలో లంక ఓటమి ఖాయం అనుకున్నా.. యువ బ్యాటర్ సోనాల్ దినుష పోరాటంతో డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన దినుష.. రెండో ఇన్నింగ్స్లో మరో సెంచరీతో మ్యాచ్ను డ్రా వైపు మళ్లించి లంకను గట్టెక్కించాడు. రెండు టెస్టుల సిరీస్లో మూడు సెంచరీలు బాదాడు. టీమిండియాపై వరుసగా సెంచరీలు చేసిన దినూష తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పటిష్ట టీమిండియాపై సెంచరీలు చాలా సంతోషంగా ఉందని, గాల్లో తేలిపోతున్నట్లు ఉందని చెప్పాడు.
సోనాల్ దినూషకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తన విజయానికి కోచింగ్ స్టాఫ్, చిన్ననాటి స్కూల్ కోచ్, ప్రావిన్స్ కోచ్, కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పాడు. ‘ముందుగా ఇక్కడ పరుగులు సాధించేందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. ముఖ్యంగా మా కోచింగ్ సిబ్బందికి ధన్యవాదాలు. వాళ్లు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే నా స్కూల్ కోచ్లు, ప్రావిన్షియల్ కోచ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. ఇక్కడి పిచ్ టర్న్ అవుతుందని ముందుగానే అర్థం చేసుకున్నాను. అందుకు అనుగుణంగా కొన్ని మంచి ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించాను. అదే నాకు పరుగులు సాధించేందుకు ఉపయోగపడింది’ అని చెప్పాడు.
‘ఐదో రోజు టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం బాగా అనిపించింది. మా టెయిలెండర్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. నేను మరిన్ని పరుగులు చేయడానికి వారు సాయపడ్డారు. పరిస్థితిని అర్థం చేసుకుని నా వంతుగా అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నించాను. పరుగులు అవే వచ్చాయి. జట్టుకు నా వంతు సాయం చేసినందుకు సంతోషంగా ఉంది. రెండు టెస్టుల సిరీస్లో మూడు సెంచరీలు చేశా. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరుగులు సాధించాలనే ఉద్దేశంతోనే నేను బ్యాటింగ్ చేశాను. అదే నా ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే శతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది. భారత్పై సుమారు 420 పరుగులుచేశాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. భారత్పై పరుగులు సాధించడం ఒక ఆటగాడిగా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇది అద్భుతమైన అనుభూతి’ అని సోనాల్ దినూష చెప్పుకొచ్చాడు.