
- పార్టీ క్యాడర్కు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపు
హైదరాబాద్, వెలుగు: ‘సర్’ ప్రక్రియ రెండో దశలో కాంగ్రెస్ అనుకూల ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలతోపాటు పార్టీ కార్యకర్తలపై ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేదలు, మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల ఓటర్లంతా కాంగ్రెస్ వైపే ఉంటారని, అందుకే వారి ఓట్లను బీఎల్వోలు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి నోటీసులు అందిన ఓటర్లను కలిసి, వారి నుంచి సరైన ఆధారాలు సేకరించి తిరిగి ఓటర్ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు గురువారం నుంచి వచ్చే నెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, డివిజన్ స్థాయిల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభల్లో పార్టీ శ్రేణులు పాల్గొని, ఓటర్ల జాబితాలో లోపాలు ఉన్న వారిని గుర్తించి తిరిగి ఓటర్లుగా చేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.