Reading Time: < 1 minute
Oscars 2027 Telugu Movies Peddi And Irumudi Miss Out Gondhal Selected

ఆస్కార్ అవార్డుల్లో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏ సినిమా నిలుస్తుందోనన్న ఉత్కంఠకు తెరపడింది. 99వ అకాడమీ అవార్డ్స్‌ (Oscars 2027) కోసం భారత్ నుంచి మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం 33 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ.. చివరకు సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్‌’ను ఎంపిక చేసింది. దాంతో తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.

ఈసారి ఆస్కార్ ఎంట్రీ కోసం తెలుగు నుంచి నాలుగు సినిమాలు జ్యూరీ పరిశీలనకు వెళ్లాయి. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’, మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’ సహా ‘ఇగ్వా’ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఆస్కార్‌ 2027 కోసం జ్యూరీ పరిశీలించిన 33 చిత్రాల్లో నాలుగు తెలుగు సినిమాలు ఉండటం టాలీవుడ్‌కు ప్రత్యేకమైన విషయం. అయితే మంచి కథా నేపథ్యంతో వచ్చిన పెద్ది, ఇరుముడిలో ఒక్కటైనా ఎంపికవుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చివరకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ కూడా నెగ్గుకురాలేకపోయాడు. చివరికి ‘హనుమాన్ అంశ్’ కూడా చేతులెత్తేసింది.

సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్‌’ సినిమా మహారాష్ట్ర సంప్రదాయ జానపద ఆచారం, కళారూపమైన గోంధల్‌ నేపథ్యంలో తెరకెక్కింది. రాత్రంతా జరిగే ఈ సంప్రదాయ వేడుకను కథలో కీలక భాగంగా మలిచారు. కొత్తగా పెళ్లైన జంట చుట్టూ కథ ప్రారంభమై.. ప్రేమ, కోరికలు, మోసం, కుటుంబ కలహాలు, ప్రమాదకర పరిణామాల వైపు సాగుతుంది. ఈ చిత్రంలో ఇషితా దేశ్‌ముఖ్, కిశోర్ కదమ్, యోగేశ్ సోహోని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సంతోష్ దావఖర్‌కు ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు ఉంది. గోంధల్‌ చిత్రానికి గాను 2025లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయన సిల్వర్ పీకాక్ అవార్డును అందుకున్నారు. 99వ అకాడమీ అవార్డుల వేడుక 2027 మార్చి 14న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. భారత్ అధికారిక ఎంట్రీగా గోంధల్‌ ఇప్పుడు అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తదుపరి ఆస్కార్ ఎంపిక ప్రక్రియలోకి వెళ్లనుంది.