Reading Time: < 1 minute
Cm Chandrababu Mourns Student Shivanis Death Orders Comprehensive Investigation

పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రేకుల షెడ్‌లో ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివాని మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు విద్యార్థిని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు.

‘ఇర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా.. విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకు లోనుకావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నా’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ నెల 24న రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ కార్యక్రమంలో ముర్రం శివాని సీఎం పక్కనే కూర్చొని మాట్లాడింది. వచ్చే ఏడాది షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. సీఎంతో ఎంతో చక్కగా మాట్లాడిన శివాని.. రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శివాని ఆత్మహత్యకు గల కారణాలు త్వరలో తెలియరానున్నాయి.