
MS Dhoni vs Rohit Sharma Captaincy: ఎంఎస్ ధోనీనా? లేదా రోహిత్ శర్మనా?.. భారత టీ20 క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించారు. తాజాగా టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబే వంతు వచ్చింది. ఇద్దరు దిగ్గజాల సారథ్యంలో ఆడిన దూబేకు ఈ ప్రశ్నతో పెద్ద సమస్యే వచ్చింది. అయితే అతడు చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. దూబే ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా.. ఇద్దరూ గొప్ప కెప్టెన్లేనని చెప్పాడు.
‘ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరూ ప్రపంచకప్లు గెలిచిన కెప్టెన్లే. ఐపీఎల్లో ఐదేసి టైటిళ్లు సాధించిన ఘనత కూడా ఇద్దరికీ ఉంది. అందుకే ఒకరిని మరొకరితో పోల్చి ఎంచుకోవడం నా వల్ల కాదు. ఐపీఎల్ విషయానికి వస్తే ధోనీనే నా మొదటి ఎంపిక. మహీ భాయ్ బెస్ట్ టీ20 కెప్టెన్. నా కెరీర్ను మలుపు తిప్పిన వ్యక్తి ధోనీ. 2022లో ధోనీని నేను కలవకపోయి ఉంటే.. నా ఐపీఎల్ కెరీర్ ఈ స్థాయికి వచ్చేది కాదు. ధోనీ ఇచ్చిన నమ్మకం, మార్గదర్శకత్వం నాకు ఎంతో ఉపయోగపడింది’ అని శివమ్ దూబే చెప్పాడు.
‘అంతర్జాతీయ టీ20 క్రికెట్ విషయానికి వస్తే మాత్రం రోహిత్ శర్మ బెస్ట్ టీ20 కెప్టెన్. 2024లో రోహిత్ భాయ్ నాకు ఇచ్చిన మద్దతు మరువలేనిది. ఆయన కారణంగానే భారత్ తరఫున రెండు టీ20 ప్రపంచ కప్లు గెలిచే అవకాశం నాకు దక్కింది. అందుకే ఐపీఎల్కు ధోనీ, అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మను బెస్ట్ కెప్టెన్’ అని శివమ్ దూబే వివరించాడు.టీమిండియా తరఫున ఇప్పటివరకు దూబే 6 వన్డేలు, 76 టీ20 మ్యాచ్లు ఆడాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన దూబే.. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగలడు. ధోనీ, రోహిత్లలో ఎవరు గొప్ప కెప్టెన్ అనే ప్రశ్నకు నేరుగా ఒక్కరి పేరే చెప్పకుండా.. ఇద్దరూ తన కెరీర్లో కీలక పాత్ర పోషించారని చెప్పి దూబే తపించుకున్నాడు.