Reading Time: 2 minutes
ఎగ్జాంలో ChatGPT ఆన్సర్లు రాసిన విద్యార్ధి సూసైడ్.. IIT ముంబై క్యాంపస్‌లో నిరసనల సెగ

ముంబై, సెప్టెంబర్ 19: ఐఐటీ ముంబై ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అతను పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ ఘటనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని IIT బాంబే స్పష్టం చేసింది. ఇన్‌స్ట్రక్టర్, విభాగాధిపతి విద్యార్థితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఈ ఘటన అతని విద్యా భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపదని భరోసా ఇచ్చారని సంస్థ వెల్లడించింది. అనంతరం విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లగా, అదే రోజు సాయంత్రం అతను మృతి చెందిన స్థితిలో కనిపించాడు. పరీక్ష సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. అనంతరం విద్యార్థి హాస్టల్ గదికి వెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

విద్యార్థుల నిరసన

ఈ ఘటన అనంతరం IIT బాంబే క్యాంపస్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు నిరసనకు దిగారు. 400 మందికి పైగా విద్యార్థులు సంస్థ ప్రధాన భవనం వద్దకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని, పారదర్శకతతో వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల వర్గం మాత్రం ఈ ఘటనకు సంబంధించి తమకు తెలిసిన వివరాలు సంస్థ అధికారిక ప్రకటనకు భిన్నంగా ఉన్నాయని ఆరోపించింది. క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్ వంటి అంశాలపై విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయని కొందరు పేర్కొన్నారు. అయితే ఈ వాదనలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. IIT బాంబే మాత్రం విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ప్రారంభించలేదని స్పష్టం చేసింది. నిరసన కొనసాగుతున్న సమయంలో IIT బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కేదారే విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం విద్యార్థుల సమావేశాన్ని కన్వొకేషన్ హాల్‌కు మార్చారు. ఘటన నేపథ్యంలో కొనసాగుతున్న మిడ్-సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యార్థులు తెలిపారు. పోలీసులు కూడా క్యాంపస్‌లో భద్రతను పెంచారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు విద్యార్థులు, సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ దత్తాత్రేయ నలవాడే తెలిపారు.

ఈ ఘటనపై IIT బాంబే తీవ్ర విచారం వ్యక్తం చేసింది. విద్యార్థి స్నేహితులు, సహచరులు, అధ్యాపకులు, ఇతర ప్రభావిత వ్యక్తులకు సంస్థ మద్దతు అందిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థి మృతికి సంబంధించిన పరిస్థితులపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొంది. ఈ ఘటన మరోసారి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థులపై ఉండే అకడమిక్ ఒత్తిడి, కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్య సహాయం, క్రమశిక్షణా విధానాలపై చర్చకు దారితీసింది. అయితే ఈ ఘటనలో విద్యార్థి ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.