
Gondhal Oscars 2027: బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన సినిమా అంటే అది అవార్డుల రేసులోనూ ముందుంటుందని అనుకోవడం సహజం. కానీ సినిమాకు సంబంధించిన ప్రతి వేదికలో లెక్కలు ఒకేలా ఉండవు. ఇప్పుడు బాలీవుడ్ బిగ్ హిట్ ‘ధురంధర్’, మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధల్’ విషయంలో ఇదే విషయం ఆసక్తికరంగా మారింది. వేల కోట్ల వసూళ్లతో రికార్డులు సృష్టించిన సినిమా ఉంటే, థియేటర్లలో పెద్దగా ఆడని సినిమా 2027 ఆస్కార్కు భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా నిలిచి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ‘గోంధల్’ 2025 నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ ట్రాకర్ సాక్నిల్క్ గణాంకాల ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ సుమారు రూ.84 లక్షల వద్ద, వరల్డ్వైడ్ గ్రాస్ సుమారు రూ.90 లక్షల వద్ద ముగిసింది. అంటే కమర్షియల్గా సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కాయి. అంతేకాదు, 2025 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా సంతోష్ దావఖర్కు సిల్వర్ పీకాక్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా లభించింది. తాజాగా ఈ సినిమాకు మరో భారీ గుర్తింపు వచ్చింది. 33 చిత్రాలతో జరిగిన ఎంపిక ప్రక్రియలో ‘గోంధల్’ను 2027 ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది.
‘గోంధల్’ కథ మహారాష్ట్ర సంప్రదాయ గోంధల్ ఆచారం, జానపద కళా రూపం చుట్టూ సాగుతుంది. సుమన్ అనే వివాహిత మహిళ జీవితంలో ప్రేమ, కోరిక, మోసం, బంధాలు, తప్పించుకోవాలనే ప్రయత్నం వంటి అంశాలు కథను థ్రిల్లర్ మలుపుల వైపు తీసుకెళ్తాయి. ఒక ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాన్ని కథలో కీలకంగా చూపిస్తూ దాన్ని ఆధునిక సంబంధాల సమస్యలతో ముడిపెట్టడం ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలిచింది. ఈ సాంస్కృతిక అంశం కూడా ఆస్కార్ ఎంట్రీ ఎంపికలో జ్యూరీ దృష్టిని ఆకర్షించిన కారణాల్లో ఒకటిగా నిలిచింది.
మరి ‘ధురంధర్’ సంగతేంటి? రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’, దాని సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ కూడా ఆస్కార్ కోసం పరిశీలనలో ఉన్న 33 సినిమాల్లో ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఆస్కార్ కోసం భారత అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఎంపిక కాలేదు. భారత్ తరఫున అధికారిక ఎంట్రీని ఎంపిక చేసే సమయంలో జ్యూరీ కోరుకున్న విధంగా భారతీయ సంస్కృతిని ‘ధురంధర్’ సినిమా ప్రతిబింబించలేదని తెలుస్తోంది. అంటే ఇక్కడ సినిమా ఎంత డబ్బు సంపాదించింది, ఎంతమంది ప్రేక్షకులు చూశారు అనే అంశాల కంటే, అంతర్జాతీయ అవార్డు వేదికపై భారతదేశాన్ని ఏ విధంగా ప్రతినిధ్యం వహించగలదు అనే విషయానికి జ్యూరీ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తం 33 సినిమాలు ఆస్కార్ ఎంట్రీ కోసం పోటీలో ఉన్నాయి. ఇందులో 14 హిందీ, నాలుగు మరాఠీ, నాలుగు తెలుగు, నాలుగు గుజరాతీ, మూడు తమిళ సినిమాలతో పాటు మలయాళం, నాగమీస్, ఇతర భాషలకు చెందిన చిత్రాలు కూడా ఉన్నాయి. చివరి దశలో ‘గోంధల్’, ‘ఆంగ్’, ‘మైన్ వాపస్ ఆయుంగా’ చిత్రాలు నిలవగా, చివరకు ‘గోంధల్’ను బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక చేశారు. 99వ అకాడమీ అవార్డుల వేడుక 2027 మార్చి 14న లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరగనుంది.
ఇక ‘గోంధల్’ టీమ్కు ఇప్పుడు మరో సవాల్ ఉంది. థియేటర్లలో కేవలం రూ.84 లక్షల ఇండియా నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమాపై ఆస్కార్ ఎంట్రీ తర్వాత ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని సినిమాను హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు సంతోష్ దావఖర్ వెల్లడించారు. దీంతో ఇంతకుముందు థియేటర్లలో పెద్దగా ప్రేక్షకులను చేరుకోలేకపోయిన ‘గోంధల్’కు ఇప్పుడు కొత్త ప్రేక్షకులు దొరికే అవకాశం ఏర్పడింది.