Hyderabad e Champions: ఖమ్మంపై ఘన విజయం.. తొలి టీజీ20 ట్రోఫీ పట్టేసిన హైదరాబాద్..!

Khammam Aces vs Hyderabad Final: తెలంగాణ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి వేదికైన తొలి టీజీ20 లీగ్లో ‘హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్’ జయకేతనం ఎగరేసింది. ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో అన్విత ఖమ్మం ఏసెస్పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ దశ నుంచి తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోయిన హైదరాబాద్ జట్టు, ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి తొలి సీజన్ ట్రోఫీని ముద్దాడింది.
ఖమ్మంకు బ్రేకులు వేసిన హైదరాబాద్ బౌలర్లు..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అన్విత ఖమ్మం ఏసెస్ జట్టుకు హైదరాబాద్ బౌలర్లు పవర్ ప్లేలోనే గట్టి షాక్ ఇచ్చారు. కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఖమ్మం జట్టును హిమతేజ (31), మికిల్ జైస్వాల్ (65) అర్ధశతకంతో ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో యశ్వీర్ గౌడ్ మూడు కీలక వికెట్లతో దెబ్బకొట్టి మ్యాచ్ను మళ్లీ హైదరాబాద్ వైపు తిప్పాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఖమ్మం జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ గౌడ్ 3 వికెట్లు తీయగా, అజయ్ దేవ్ గౌడ్, దేవ్ మెహతా రెండేసి వికెట్లతో రాణించారు.
ముందుండి నడిపించిన కెప్టెన్.. ఊదరగొట్టిన బ్యాటర్లు..
158 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ అభిరథ్ రెడ్డి (48 పరుగులు, 30 బంతుల్లో) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టుకు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా షణ్ముఖ అశ్విన్ (36 పరుగులు) మెరుపులు మెరిపించాడు. వీరిద్దరూ అవుటైన తర్వాత మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారినప్పటికీ, వైష్ణవ్ రెడ్డి (41 నాటౌట్) బాధ్యతాయుతమైన ఆటతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రణవ్ వర్మ (19 నాటౌట్) తోడుగా వైష్ణవ్ రెడ్డి 18వ ఓవర్లో భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించి, 14 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.
ఇది కూడా చదవండి: ‘నా పేరిట చెత్త రికార్డ్.. ప్రపంచంలో కెప్టెన్ జీరో నేనే’..: శ్రేయస్ అయ్యర్
ఆరెంజ్ క్యాప్ విజేతగా అభిరథ్.. కోటి రూపాయల ప్రైజ్ మనీ..
#HyderabadEChampions #TG20 #Champions #Cricket #Finals pic.twitter.com/GBoMOvI3od
— Hyderabadechampions (@HydeChampions) July 12, 2026
ఈ టోర్నీలో హైదరాబాద్ విజయాల వెనుక కెప్టెన్ అభిరథ్ రెడ్డి కృషి ఎంతో ఉంది. ఒకానొక దశలో క్రికెట్లో అవకాశాలు రాక అమెరికా వెళ్ళిపోవాలనుకున్న అభిరథ్, ఈ లీగ్లో ఏకంగా 549 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. అలాగే బౌలింగ్లో అజయ్ దేవ్ గౌడ్ 21 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విజయంతో టైటిల్ గెలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుకు రూ. 1 కోటి రూపాయల నగదు బహుమతి లభించగా, రన్నరప్గా నిలిచిన ఖమ్మం జట్టుకు రూ. 50 లక్షలు దక్కాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

