July 14, 2026

Adah Sharma: ప్రమోషన్‌ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్

Adah Sharma: ప్రమోషన్‌ లో కొత్త స్టంట్.. ఒంటరిగా రిస్క్ చేసిన అదా శర్మ.. వీడియో వైరల్
Reading Time: 2 minutes
Adah Sharma Watches Evil Dead Burn Alone In Empty Theatre Viral Promotion

Adah Sharma: హారర్ సినిమాలు చూడాలంటేనే చాలా మంది వణికిపోతుంటారు. అందుకే పక్కన ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. చీకట్లో ఒంటరిగా థియేటర్‌లో కూర్చొని హారర్ మూవీ చూడాలంటే ధైర్యమే కాదు, గుండె బలమూ కావాలి. అలాంటి సవాలును ప్రముఖ నటి అదా శర్మ స్వయంగా స్వీకరించింది. హాలీవుడ్ హారర్ చిత్రం ‘ఈవిల్ డెడ్ బర్న్’ ప్రమోషన్‌లో భాగంగా ఖాళీగా ఉన్న సినిమా హాల్‌లో ఒంటరిగా సినిమా చూస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కొత్త తరహా ప్రచార కార్యక్రమం బాగానే వర్క్ అవతున్నట్లు కనిపిస్తోంది. ఈవిల్ డెడ్ హారర్ ఫ్రాంచైజీలో ఆరవ భాగంగా సెబాస్టియన్ వానిసెక్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈవిల్ డెడ్ బర్న్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందే సోనీ పిక్చర్స్ ఇండియా ఈ చిత్రానికి ప్రచార కర్తగా అదా శర్మను ఎంపిక చేసింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె ఖాళీ థియేటర్‌లో ఒంటరిగా కూర్చొని సినిమాను వీక్షించిన వీడియోను అదా శర్మతో పాటు సోనీ పిక్చర్స్ ఇండియా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

ఈ ప్రచార కార్యక్రమానికి అదా శర్మను ఎంపిక చేయడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. ఆమె సినీ ప్రయాణం 2008లో విడుదలైన సూపర్ హిట్ హారర్ చిత్రం ‘1920’తో ప్రారంభమైంది. తొలి సినిమాతోనే హారర్ జానర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అదా, ఇప్పుడు మరో హాలీవుడ్ హారర్ చిత్రానికి ప్రచార కర్తగా మారడం ఆసక్తిగా మారింది. హారర్ సినిమాల్లో ఆమెకున్న అనుభవం, ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు ఈ ప్రమోషన్‌కు మరింత హైప్ తెస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారత మార్కెట్‌పై హాలీవుడ్ స్టూడియోలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కేవలం సినిమాలను భారతీయ భాషల్లో డబ్ చేయడం మాత్రమే కాకుండా, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రేక్షకులకు దగ్గర కావాలని భావిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సినిమా మార్కెట్లలో భారత్ ఒకటిగా మారడంతో, ఈ తరహా ప్రమోషన్ వ్యూహాలను సదరు నిర్మాణ సంస్థలు మరింతగా అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే అదా శర్మ వంటి ప్రముఖ నటిని ఈ మూవీ ప్రచారానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇక అదా శర్మ కెరీర్ విషయానికి వస్తే, హారర్ చిత్రాలతో పాటు ‘కమాండో’ సిరీస్, ‘ది కేరళ స్టోరీ’ వంటి చిత్రాలతో కూడా ఆమె మంచి గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఆమె ‘సూపర్ వెల్లి’ అనే సూపర్ హీరో చిత్రంలో నటిస్తుండగా, ‘గజ్రా’ సినిమాతో మరాఠీ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న అదా, ఇప్పుడు హాలీవుడ్  సినీ ప్రచారంలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.