July 14, 2026

Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..

Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
Reading Time: < 1 minute
Asia Under 23 Athletics Pravallika Gold Medal Telangana

Asian U23 Athletics: చైనాలోని ఒర్డోస్ వేదికగా జరుగుతున్న తొలి ‘ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 2026’లో భారత యువ అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. ముఖ్యంగా మహిళల 4×400 మీటర్ల రిలే పరుగుపందెంలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించి దేశ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికపై ఇనుమడింపజేసింది. ఈ గోల్డ్ మెడల్ విజేతల్లో ఒకరైన తెలంగాణ బిడ్డ ప్రవల్లిక నరిమళ్లను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అసమాన ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై రాణించిన ప్రవల్లిక.. యువ క్రీడాకారులందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తోందని సీఎం ప్రశంసించారు.

తాపీ మేస్త్రీ కూతురు.. గురుకులాల గర్వకారణం

ఒక సాధారణ తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతున్న ప్రవల్లిక.. డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో అత్యుత్తమ శిక్షణ పొందింది. ఈ స్థాయికి చేరుకోవడానికి ముందే ఆమె దేశీయంగా అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. వివిధ క్రీడా వేదికలపై ఏకంగా 23 స్వర్ణాలతో సహా మొత్తం 35 రాష్ట్ర స్థాయి పతకాలను సాధించి తన పరుగు పవర్ ఏంటో చూపించింది. ఇంతటి ప్రతిభావంతురాలిని తీర్చిదిద్దిన ఆమె కోచ్‌లకు కూడా ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

చైనాను అధిగమించి ‘గోల్డ్’ కొట్టిన వైనం

ఆసియా అండర్-23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ 4×400 మీటర్ల రిలే జట్టులో ప్రవల్లికతో పాటు శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ నలుగురు సభ్యుల భారత మహిళల బృందం పరుగును కేవలం 3:33.62 సెకన్ల రికార్డు సమయంలోనే పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో బలమైన పోటీనిచ్చిన ఆతిథ్య దేశమైన చైనా జట్టును సైతం భారత్ వెనక్కి నెట్టడం విశేషం.

మెగా టోర్నీలో భారత అథ్లెట్ల హవా

ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు ఓవరాల్‌గా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నీలో మొత్తంగా 3 స్వర్ణ (Gold), 4 రజత (Silver), 9 కాంస్య (Bronze) పతకాలతో కలిపి మొత్తం 16 పతకాలను భారత క్రీడాకారులు తమ ఖాతాలో వేసుకున్నారు. దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన భారత అథ్లెట్లందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.