July 14, 2026

Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!

Gautam Gambhir: టీ20 వరల్డ్‌కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
Reading Time: 2 minutes
Gautam Gambhir Eyes 2028 Olympics After T20 World Cup Triumph Set To Continue As India Coach

Gautam Gambhir: భారతదేశ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ కోనసాగుతోంది. ఇదివరకు ఐర్లాండ్, ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనల్లో టీ20 సిరీస్‌లలో టీమిండియా ఘోర పరాజయాలు ఎదుర్కొనడంతో గంభీర్‌పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఈ ఓటములు ఆయన పదవిపై ప్రభావం చూపే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాదు.. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా గంభీర్ కోచ్‌గా కొనసాగాలని భావిస్తున్నట్లు వార్తలు గట్టిగా వినపడుతున్నాయి.

ప్రముఖ నివేదికలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. గంభీర్ ఇప్పటికే లాస్ ఏంజెల్స్-2028 ఒలింపిక్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. క్రికెట్ ఒలింపిక్స్‌ లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో భారత జట్టుకు బంగారు పతకం అందించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ కారణంగానే కనీసం 2028 ఒలింపిక్స్ వరకు కోచ్‌గా కొనసాగాలని గంభీర్ అనుకున్నట్లు తెలుస్తోంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో కేవలం ఆరు జట్లు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత నిర్ణయించనున్నారు. భారత్ ఆసియాలో నెం.1 టీ20 జట్టుగా తన స్థానాన్ని కొనసాగిస్తే నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. మరోవైపు భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో కొన్ని పరాజయాలు ఎదురైనా.. గంభీర్ హయాంలో భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో అద్భుత విజయాలు సాధించింది. ఆయన కోచింగ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచకప్ 2026, అలాగే ఆసియా కప్ ను భారత్ కైవసం చేసుకుంది. సాధారణంగా బీసీసీఐ కోచ్ పనితీరును ద్వైపాక్షిక సిరీస్‌ల కంటే ఐసీసీ ట్రోఫీల ఆధారంగానే అంచనా వేస్తుంది. అందుకే ప్రస్తుతం గంభీర్ పదవికి ఎలాంటి ముప్పు కనపడ్డం లేదు. భారత్ 2027 వన్డే ప్రపంచకప్ లేదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిస్తే, గంభీర్ కాంట్రాక్ట్‌ను మరో ఏడాది పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో 2028 ఒలింపిక్స్ వరకు ఆయన భారత జట్టుకు కోచ్‌గా కొనసాగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి.

2024 జూలై నుంచి గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ పలు ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకుంది. జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లపై విజయాలు నమోదు చేసింది. మధ్యలో కొన్ని టెస్టు, వన్డే సిరీస్‌ల్లో నిరాశ ఎదురైనా.. మొత్తం మీద గంభీర్ కోచింగ్‌లో భారత్ 95 మ్యాచ్‌ల్లో 61 విజయాలు నమోదు చేయగా.. 29 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.