Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు

పోక్సో (POCSO) చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. యుక్తవయసులో ఉన్న అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతే ప్రతి కేసును పోక్సో కేసుగా పరిగణించడం సరైన విధానం కాదని పేర్కొంది. కుటుంబ పరువును కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. యుక్తవయసు బాలబాలికల గోప్యత హక్కులకు సంబంధించిన సుమోటో కేసును విచారిస్తున్న సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎలా ఆపగలం?
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. ‘‘ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోతే ప్రభుత్వం దాన్ని ఎలా ఆపగలదు? పోక్సో చట్టం చిన్నారులపై లైంగిక దాడులు, లైంగిక దోపిడీని అరికట్టేందుకు రూపొందించబడింది. 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు ప్రయోగాత్మక దశ. అలాంటి ప్రతి సంబంధాన్ని పోక్సో కేసుగా పరిగణించాలా?.’’ అని ప్రశ్నించింది.
ఈ కేసు కలకత్తా హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా (సుమోటోగా) నమోదు చేసింది. ఆ తీర్పులో ఏం పేర్కొందంటే.. ‘‘యుక్తవయసు బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి. రెండు నిమిషాల ఆనందం కోసం ప్రేమ సంబంధాల్లో పడకూడదు.’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుని రద్దు చేసింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ కేసు పురోగతిని కోర్టుకు వివరించారు. ఈ కేసులో మైనర్ బాలిక 25 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడి అతనితో కలిసి వెళ్లిపోయిందని తెలిపారు. ప్రస్తుతం వారిద్దరూ వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారని, వారికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. అదే విధంగా పోక్సో కేసుల నిర్వహణలో వ్యవస్థలో ఉన్న లోపాలపై కోర్టు నియమించిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందని చెప్పారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ.. ‘‘16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సులో యువతీ యువకులు ప్రేమలో పడటం, కలిసి వెళ్లిపోవడం జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో కుటుంబ పరువును కాపాడుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. చివరికి మేమే వారిని నిర్దోషులుగా విడుదల చేయాల్సి వస్తోంది..’’ అని వ్యాఖ్యానించింది.
యువతకు అవగాహన అవసరం
సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ మాట్లాడుతూ.. 17-18 ఏళ్ల యువకులు కూడా పోక్సో కేసుల్లో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. చిన్న వయస్సు నుంచే అవగాహన కల్పించడం అవసరమని సూచించారు. 6వ తరగతి నుంచే విద్యార్థులకు దశలవారీగా యుక్తవయసు విద్య (Adolescent Education), పోక్సో చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించిందని కోర్టుకు తెలిపారు.
పోక్సో కేసుల పర్యవేక్షణకు ఇప్పటికే ప్రతి హైకోర్టులో బాలల హక్కుల కమిటీలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమర్థంగా వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను జూలై 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.