Reading Time: < 1 minute
మూటతో కనిపించిన ఓ వ్యక్తి.. అనుమానం వచ్చి చెక్ చేయగా.. ఓర్నాయనో..!

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో సజీవ పాముల అక్రమ వ్యాపారానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సజీవ పాములను గ్రే మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై నిర్దిష్ట సమాచారం అందడంతో.. అధికారులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి  నిందితుడిని పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 17 మే 2026న డీఆర్ఐ, హెచ్‌జెడ్‌యూ సంయుక్తంగా ఒక సీక్రెట్ ట్రాప్ ఆపరేషన్‌ను ప్రణాళికబద్ధంగా అమలు చేశాయి. ఈ క్రమంలో అనుమానిత వ్యక్తిని గుర్తించి, వరంగల్‌లో అడ్డగించారు.

తనిఖీల సమయంలో నిందితుడి వద్ద ఉన్న సంచిని పరిశీలించగా, అందులో రెండు ఇండియన్ రెడ్ సాండ్ బోవా (Eryx johnii) పాములు లభించాయి. అధికారులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ రెడ్ సాండ్ బోవా అరుదైన సరీసృప జాతికి చెందినది. ఇది సవరించిన 1972 వన్యప్రాణి (సంరక్షణ) చట్టంలోని షెడ్యూల్-Iలో చేర్చబడింది. దీంతో ఈ జాతికి చెందిన జంతువులను స్వాధీనం చేసుకోవడం, రవాణా చేయడం లేదా వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. స్వాధీనం చేసుకున్న పాములతో పాటు నిందితుడిని, ప్యాకింగ్ సామాగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం తెలంగాణ అటవీ శాఖ పరిధిలోని వరంగల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు అధికారులు అప్పగించారు. వన్యప్రాణుల అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.