Reading Time: < 1 minute
కిరాతకుడు.. మందులోకి నీళ్లు ఇవ్వలేని 9 ఏళ్ల బాలుడిని ఏం చేశాడో తెలుసా..?

ఒకవైపు పసిబిడ్డకు పేరు పెడుతున్న వేడుక.. ఆ ఇల్లంతా బంధువుల కోలాహలం.. ఇంతలోనే ఒక్కసారిగా వినిపించిన తుపాకీ పేలుడు శబ్దం ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది. కేవలం మద్యంలో కలుపుకోవడానికి నీళ్లు తీసుకురాలేదన్న చిన్న కారణంతో ఒక ఉన్మాది తొమ్మిదేళ్ల బాలుడిని కాల్చి చంపిన హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా సహావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యాకుత్‌గంజ్ గ్రామానికి చెందిన జస్వీర్ గోలా కుమారుడి నామకరణోత్సవం జరుగుతోంది. ఈ వేడుకకు బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిందితుడు ధనేష్ యాదవ్ కూడా జస్వీర్ బంధువు కావడంతో ఈ కార్యక్రమానికి వచ్చాడు. అయితే వేడుకలో ఉండగానే ధనేష్ అతిగా మద్యం సేవించినట్లు తెలుస్తోంది.

చిన్న నిరాకరణే మరణశాసనమైంది..

మృతుడి తండ్రి సుఖ్‌బీర్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం సేవించే క్రమంలో ధనేష్ అక్కడే ఉన్న 9 ఏళ్ల యశ్‌ను నీళ్లు తీసుకురమ్మని అడిగారు. యశ్ అందుకు నిరాకరించడంతో ధనేష్ విచక్షణ కోల్పోయాడు. తీవ్ర ఆగ్రహంతో తన వద్ద ఉన్న పిస్టల్ తీసి, ఏమాత్రం కనికరం లేకుండా ఆ చిన్నారి కడుపులోకి కాల్పులు జరిపాడు. తూటా నేరుగా కడుపులోకి దూసుకెళ్లడంతో యశ్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి అతిథులు భయాందోళనలకు గురికాగా, ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే యశ్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అలీగఢ్‌కు రిఫర్ చేశారు. అక్కడ మృత్యువుతో పోరాడిన యశ్, శనివారం చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

నిందితుడి అరెస్ట్

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గోవింద్ బల్లభ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఖితౌలి కాలువ వంతెన సమీపంలో ధనేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి నేరానికి ఉపయోగించిన పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేవలం నీళ్ల కోసం ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.