Reading Time: 3 minutes
Fact Check : వాంఖడే గ్రౌండ్ స్టాఫ్‌కు హార్దిక్ పాండ్యా రూ.10 లక్షలు ఇచ్చాడా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?

Fact Check : ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. వాంఖడే స్టేడియం గ్రౌండ్ స్టాఫ్ కోసం హార్దిక్ భారీ మొత్తంలో నగదు బహుమతిగా ఇచ్చాడంటూ కొన్ని వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే, ఇందులో నిజమెంత? హార్దిక్ నిజంగానే లక్షలు ఇచ్చాడా? అనే విషయాలపై క్లారిటీ వచ్చేసింది. ఐపీఎల్ 2026 సీజన్లో రేపు (మార్చి 29) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ఒక వార్త వైరల్ అయ్యింది. అదేంటంటే.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026 కోసం తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాంఖడే గ్రౌండ్ స్టాఫ్ తనకు ఎంతో సహకరించారని, దానికి కృతజ్ఞతగా 11 మంది సిబ్బందికి తలా రూ.10 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశాడనేది ఆ వార్త సారాంశం. వినడానికి చాలా బాగున్న ఈ వార్త నెట్టింట తెగ షేర్ అయ్యింది.

నిజం బయటపెట్టిన జర్నలిస్టులు

అయితే, ఈ వార్తలో అసలు నిజం లేదని ప్రముఖ క్రీడా జర్నలిస్టు గౌరవ్ గుప్తా స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా గ్రౌండ్ స్టాఫ్‌కు నగదు బహుమతి ఇచ్చిన మాట వాస్తవమే కానీ, అది రూ.10 లక్షలు కాదు. అతను ప్రతి ఒక్కరికీ రూ.10,000 (పది వేల రూపాయలు) మాత్రమే బహుమతిగా ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఎవరో అతి ఉత్సాహంతో ఆ మొత్తాన్ని రూ.10 లక్షలుగా మార్చి పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.

ముంబై వర్సెస్ కేకేఆర్

నిజం తెలిశాక హార్దిక్ పాండ్యాను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు పది లక్షలు ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, హార్దిక్ తన సొంత డబ్బుతో సిబ్బందిని గౌరవించడం మంచి విషయమే. ప్రస్తుతం హార్దిక్ దృష్టాంతమంతా రేపు వాంఖడే స్టేడియంలో జరగనున్న కేకేఆర్ మ్యాచ్‌పైనే ఉంది. గత ఏడాది కెప్టెన్సీ వివాదాల వల్ల విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్, ఈసారి తన ఆటతో, కెప్టెన్సీతో అందరి నోళ్లు మూయించాలని పట్టుదలతో ఉన్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..