Reading Time: < 1 minute
ప్రయాణికులకు ఎగిరిగంతేసే న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్.. తగ్గనున్న ఛార్జీల భారం..

హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లల్లో ప్రయాణాలు చేసేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-హైదరాబాద్ మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాస్ లను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని.. దీనికోసం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సంజయ్ జాజు ఆదివారం మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేయగా.. ఉమ్మడి చార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాస్ ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలు సూచనలు చేశారు.

దీంతో అధికారులు మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ, మంత్లీ, డైలీ ఛార్జీల వివరాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ, మెట్రో అధికారుల సమావేశం అనంతరం.. ఉమ్మడి చార్జీలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనికోసం త్వరలోనే సన్నాహాలు జరగనున్నాయి.

ఉమ్మడి పాస్ విధానం అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌లో రోజూ బస్సు, మెట్రో సేవలను వినియోగించే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ఒకే పాస్‌తో రెండు రకాల ప్రజా రవాణా సేవలను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణం మరింత సులభం కావడంతో పాటు ఛార్జీల భారం కూడా తగ్గే అవకాశం ఉంది.