
అమరావతి అంటే ఇక కేవలం పరిపాలనా నగరమో, సాంకేతిక హబ్ మాత్రమే కాదు.. భక్తి పారవశ్యం విరబూసే దివ్య ఆధ్యాత్మిక కేంద్రం కూడా! ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ‘టెంపుల్ క్యాపిటల్’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల క్షేత్రం తరహాలోనే అత్యంత వైభవంగా అభివృద్ధి చేసే బృహత్తర పనులు ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు రూ.260 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయి.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆధునికతతో పాటు ఆధ్యాత్మికతను సమాంతరంగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా వెంకటపాలెం శ్రీవారి ఆలయాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య సన్నిధిని భక్తులకు మరింత చేరువ చేసేందుకు రెండు దశల్లో అభివృద్ధి పనులను టీటీడీ నిర్వహిస్తోంది.
తొలి దశలో భాగముగా ఆలయానికి రెండవ ప్రాకారం, అద్భుత శిల్పకళతో కూడిన ఏడంతస్తుల మహా రాజగోపురం, అర్చకులు, భక్తుల కోసం ఆర్జిత సేవా మండపం, రథ మండపం, వాహన మండపం, దివ్య పుష్కరిణి, ప్రాంగణంలో ఐదు ముఖాల అభయాంజనేయస్వామి విగ్రహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇక రెండో దశలో భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన మాడ వీధులు, విశాలమైన అప్రోచ్ రోడ్లు, వేలాది మందికి నిత్యాన్నదానం అందించే భారీ అన్నదాన కాంప్లెక్స్, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం అధునాతన విశ్రాంతి భవనాలు, అర్చకులు-సిబ్బంది నివాస గృహాలు , పరిపాలనా భవనాలను టీటీడీ నిర్మించనుంది.
ఇటీవలే వెంకటపాలెం ఆలయ నిర్మాణ పనులను టీటీడీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండో ప్రాకారం, నాలుగు దిక్కులా నిర్మిస్తున్న గాలి గోపురాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిరంతరం ప్రగతి నివేదికలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఒకవైపు రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, ఐటీ , క్వాంటమ్ సాంకేతిక ప్రాజెక్టుల వంటి ఆధునిక నిర్మాణాలతో అమరావతి ప్రగతి పథంలో దూసుకుపోతుండగా.. మరోవైపు శ్రీవారి ఆలయం, ఆధ్యాత్మిక ఉత్సవాల ద్వారా పర్యాటక, వ్యాపార రంగాలకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించినట్లుగా అమరావతిని నిజమైన “దేవతల రాజధాని”గా మలచాలనే దిశగా అడుగులు పడుతున్నాయి.
వెంకటపాలెం శ్రీవారి ఆలయంతో పాటు, అమరావతిలోని ప్రాచీన పంచారామ క్షేత్రమైన అమరలింగేశ్వర స్వామి ఆలయం, అనంతవరం కొండపై వెలసిన మీసాల వెంకన్న స్వామి ఆలయం, వైకుంఠపురం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను కలుపుతూ ఒక సమగ్ర “ఆధ్యాత్మిక సర్క్యూట్” రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది.
ఆధ్యాత్మిక సర్క్యూట్తో పాటు బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక ప్రదేశాలను అనుసంధానిస్తే అమరావతికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు, భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల అమరావతిలో నూతన “టూరిజం ఎకానమీ” రూపుదిద్దుకుంటుంది. భక్తుల రాక పెరిగే కొద్దీ స్థానికంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, పార్కింగ్ సదుపాయాలు, షాపింగ్ మాల్స్ వంటి సేవా రంగాలకు అపారమైన డిమాండ్ ఏర్పడి వేలాది మంది యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ పూర్తయితే, తిరుమల తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రధాన శ్రీవారి క్షేత్రంగా ఇది రికార్డులకెక్కనుంది. పరిపాలనా నగరంగా ప్రస్థానం ప్రారంభించిన అమరావతి, రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక రాజధానిగా దేశ పటంలో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.