Reading Time: 2 minutes
Duleep Trophy Vaibhav Suryavanshi Craze Autographs Chennai

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తనకున్న అపారమైన క్రేజ్, పాపులారిటీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. మైదానంలోకి దిగిన నిమిషం నుంచే ప్రేక్షకులు ఆయన ఆటతీరును ఆస్వాదించారు. చెన్నై మైదానంలో మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైభవ్, మైదానంలో ఉన్నంతసేపు తన శైలికి తగ్గట్టుగా వినోదాన్ని పంచాడు. కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి తృటిలో అర్ధశతకం మిస్ అయినప్పటికీ, అతడు కొట్టిన ప్రతీ షాట్‌కు అభిమానులు బౌండరీ లైన్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

చామా మిలింద్ బౌలింగ్‌లో వైభవ్ అవుటై పెవిలియన్‌కు చేరుకుంటున్న సమయంలో మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్ ఆడుతుండగానే స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు అతని ఆటోగ్రాఫ్ కోసం పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. తన క్రేజ్‌ను చూసి వైభవ్ మైదానం వెలుపల వేచి ఉన్న అభిమానులకు ఓపిగ్గా ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపంచాడు. అభిమానులు తమ వద్ద ఉన్న క్రికెట్ బంతులు, టీ-షర్టులను సైన్ చేయడం కోసం ఆయనకు అందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఐపీఎల్ టోర్నీ సమయంలో అతని జట్టు రాజస్థాన్ రాయల్స్ చెన్నైలో మ్యాచ్ ఆడకపోవడంతో, చెన్నై అభిమానులు వైభవ్‌ను ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి. చిన్న వయసులోనే లభించిన ఈ ఆదరణ, మైదానంలో ఆయనకు లభించిన గ్రాండ్ వెల్‌కమ్ వైభవ్ సూర్యవంశీకి భారత క్రికెట్‌లో ఉన్న క్రేజ్ ఏ స్థాయిదో స్పష్టం చేసింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో అభిమానుల మనసు గెలుచుకోవడం అతని ప్రత్యేకతను చాటిచెప్పింది.