
రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభా పక్షం (BRSLP) కీలక సమావేశం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో శనివారం నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలి
సభకు హాజరయ్యే విషయంలో ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తమకు అసెంబ్లీలో సంఖ్యాబలమే అత్యంత కీలకమని, కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. సభలో ప్రజా సమస్యలపై గళం విప్పడానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సమాచారంతో సద్ధమవ్వాలని సూచించారు.
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఆ అసంతృప్తిని, ప్రజల సమస్యలను శాసనసభ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్ష ప్రజాప్రతినిధులపైనే ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరు, విఫలమైన అంశాలు , ప్రజా సంక్షేమ పథకాల నిలిపివేతపై ఉభయసభల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పిలుపునిచ్చారు.
పక్షపాత వైఖరిపై పోరాటం
శాసనసభ నిర్వహణలో స్పీకర్ ఒకవేళ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తే తీవ్రంగా ఖండించాలని, నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన సమయాన్ని , హక్కులను సాధించుకోవాలని కేసీఆర్ నేతలకు సూచించారు. సభలో ప్రజాస్వామ్యబద్ధంగా, సమర్థవంతంగా పోరాడి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో నిర్ణయించారు.