
Fatima Sana Reacts to Pakistan Loss vs India: మహిళల ఆసియా కప్ 2026లో భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు భారత బౌలర్ల ధాటికి 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించారు. బ్యాటింగ్లో వికెట్ల పతనం ఆగలేదని, ఇన్నింగ్స్ ఆసాంతం తమ బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు.
‘మా బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. భారత బౌలర్లకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయాం. పరుగులు చేయడానికి ఇన్నింగ్స్ మొత్తం చాలా కష్టపడ్డాము. తొలుత బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయం సరైంది కాదని ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే అర్థమైంది. వికెట్ తాజాగా ఉంది కాబట్టే ముందుగా బ్యాటింగ్ చేసి సాధ్యమైనంత ఎక్కువ స్కోరు చేయాలని భావించాము. మా బౌలింగ్ విభాగం బలంగా ఉంది. మంచి స్కోరు సాధిస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావచ్చని భావించాం. కానీ మేము అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది. భారత్కు కనీస పోటీ ఇవ్వలేకపోయాం. బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతుంటుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి’ అని ఫాతిమా సనా తెలిపారు.
భారత్పై మూడు వికెట్లు తీసిన తన బౌలింగ్ ప్రదర్శన గురించి కూడా ఫాతిమా సనా స్పందించారు. వ్యక్తిగతంగా తన ప్రదర్శన ఎలా ఉన్నా.. జట్టు ఓడిపోవడంతో దానికి పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పారు. తమకు కావాల్సింది విజయం మాత్రమేనని, అది దక్కనప్పుడు వ్యక్తిగత ప్రదర్శన గురించి ఆలోచించడం అనవసరమని పేర్కొన్నారు. తదుపరి మ్యాచ్ ఎంతో కీలకమని తెలిపారు. ఇకపై జరిగే మ్యాచ్లో మెరుగైన క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని, చివరి మ్యాచ్లో విజయం సాధించి నాకౌట్ దశకు, ఫైనల్కు చేరేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని ఫాతిమా సనా ధీమా వ్యక్తం చేశారు.