
- ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా
గుడిహత్నూర్,(ఉట్నూరు), వెలుగు: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా శనివారం ఇంద్రవెల్లి మండలంలోని హర్కాపూర్ తండాలో పిరమల్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన సమగ్ర ఆరోగ్య పరీక్షా శిబిరాన్ని, ప్రచార వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో తొలిసారిగా ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తామని తెలిపారు. ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ పూర్తిగా నయమవుతుందని స్పష్టం చేశారు. అనంతరం రోగులకు నిక్షయ్ మిత్ర కిట్లను పంపిణీ చేసి, ఉత్తమ సేవలందించిన మెడికల్ ఆఫీసర్ సరస్వతికి ప్రశంసాపత్రం అందజేశారు.
తీజ్ వేడుకల్లో సందడి
గ్రామంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానికులు, అధికారులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసి ఉత్సాహపరిచారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్వో సాధన, అడిషనల్ డీఎంహెచ్వో మనోహర్, డీఆర్డీవో రవీందర్, ప్రోగ్రామ్ అధికారి సుమలత, సర్పంచ్ రోహిదాస్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.