Reading Time: < 1 minute
ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది.. ఎస్ఆర్సీసీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి..ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ,కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుకు, అధ్యాపకులు,విద్యార్దులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రపంచం భారత్‌ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చూస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత్ సాధించిన 7.8 శాతం త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. భారత్ పాలసీ పక్షవాతం నుంచి పాలసీ గతిశీలత వైపు చాలా దూరం వచ్చిందని స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులు కలిసి భారత్‌ను వికసిత్, ఆత్మనిర్భర్ గా మారుస్తారని ప్రధాని అన్నారు.

ఎస్ఆర్సీసీ సేవలను కొనియాడిన ప్రధాని

ఎస్ఆర్సీసీ తరతరాల విద్యార్థులకు నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం, ఎదగడం కోసం అవకాశాలు కల్పించిందని ప్రధాని అన్నారు.కళాశాల అకడమిక్ శ్రేష్ఠతలో తనదైన ముద్ర వేసుకుందని, సంస్థ నిర్మాణంలో ప్రత్యేకత సాధించిందని ఆయన కొనియాడారు. ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులను చాలా ప్రత్యేకమైనవారని, జెన్-జడ్ భాషలో ఓజీలు అని పిలిచారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థి అని గుర్తు చేశారు. కళల నుంచి రాజకీయాల వరకు ప్రతి రంగంలో ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు తమ ముద్ర వేశారని, ఎస్ఆర్సీసీ విద్యార్థులు కళాశాల గౌరవాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లినందుకు పూర్వ విద్యార్ధులను ప్రశంసించారు.

2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామ్ కళాశాలకు వెళ్లిన మోదీ.. 13 సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. శ్రీరామ్ కళాశాల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.100 ప్రత్యేక నాణెం విడుదల చేశారు. ఎస్ఆర్సీసీ శతాబ్ది వేడుకల కోసం ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి ఎస్ఆర్సీసీకి చేరుకున్నారు. ప్రయాణంలో విద్యార్థులు, పిల్లల తో పాటు తోటి ప్రయాణికులతో మాట్లాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.