
కుక్క కాటును లైట్ తీసుకుంటే ఎంత ప్రమాదమో మరోసారి రుజువైన ఘటన ఇది. కుక్క కరిచినా ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేసిన యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరికిబండ మధిర గ్రామం తుపాకులపల్లిలో యువకుడు చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
తుపాకులపల్లి గ్రామానికి చెందిన సురేశ్ (24) సురేశ్ పాల వ్యాపారం చేస్తుండేవాడు. మూడు నెలల కిందట జీడిపల్లిలో పాలు పోసి బైక్ పై వెళ్తుండగా కుక్క కరిచింది. ఇంట్లో చెప్పకపోగా, వైద్యం చేయించుకోలేదు. ఏమవుతుందిలే అని వదిలేశాడు.
ఇటీవల లక్షణాలు బయట పడటంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించగా నయం కాలేదు. వింతగా ప్రవర్తిస్తుండడంతో హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. 2026 సెప్టెంబర్ 05 ( శనివారం) మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతిచెందాడు. చెట్టంత కొడుకు అర్థంతరంగా కన్నుమూయటంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుని రోధిస్తున్నారు.
కుక్కు కాటును నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు హెచ్చరించారు. అది పిచ్చి కుక్క అయినా, మంచి కుక్క అయినా కుక్క కరిస్తే టీకా వేసుకోవాలని సూచించారు.