Reading Time: < 1 minute
Revanth Reddy Nakrekal Speech Open Challenge To Kcr Brs

నకిరేకల్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ ప్రభుత్వ వెయ్యి రోజుల ప్రజాపాలనకు మధ్య వ్యత్యాసాన్ని బేరీజు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయకపోగా, మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆనాడు లక్ష రూపాయల రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేని బీఆర్ఎస్ నాయకులు, తమ పాలనపై సన్నాసుల్లా ఊరూరా తిరుగుతూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్లతో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు. రైతు భరోసా, వడ్ల కొనుగోళ్లు, ఉచిత కరెంటు, బోనస్ వంటి పథకాల కోసం రూ.36 వేల కోట్లు నగదు బదిలీ చేశామని వివరించారు. ఈ అంశాలపై, అలాగే రైతులకు చేసిన ఖర్చుపై శాసనసభలో చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్‌కు బహిరంగ సవాల్ విసిరారు. ధైర్యముంటే కేసీఆర్ శాసనసభకు రావాలని, లేకపోతే గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకుని రూ.7,500 కోట్లు దిగమింగారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాలు అమ్ముకుని కోట్లు వెనకేసుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ఫామ్‌హౌస్‌లలో కూర్చుని పిల్లిలా శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన గొప్పోళ్లు అయిపోరని, తమ సంస్కారం ఏంటో సభకు వచ్చి మాట్లాడి తేల్చుకుందామని కేటీఆర్‌కు సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో కుటుంబానికే ప్రాధాన్యం దక్కితే, తమ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకూ మంత్రివర్గంలో, చట్టసభల్లో సముచిత స్థానం లభించిందని చెప్పారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆరునూరైనా కొనసాగిస్తామని, 2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని ప్రకటించారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, సిద్దిపేటలలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు దండయాత్ర చేస్తారని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 117, లేదంటే 90 సీట్లు గెలుచుకుని వచ్చే పదేళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.