
Woman Attacked With Petrol in Adoni RTC bus stand: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆదోని ఆర్టీసీ బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహిళ కళ్లలో కారం చల్లి, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని నర్సమ్మగా పోలీసులు గుర్తించారు. ఆమె మున్సిపాలిటీలో శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఇద్దరు గుర్తుతెలియని మహిళలు నర్సమ్మపై దాడి చేశారు. కారం కళ్లలో చల్లిన అనంతరం నర్సమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, సిబ్బంది ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం నర్సమ్మ భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తూ.. శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటోంది. విధుల్లో ఉండగా ఆమెపై ఈ దారుణ దాడి జరగడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నర్సమ్మపై దాడి వెనుక అసలు కారణం ఏమిటనే దానిపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆదోని ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. బాధితురాలిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు?.. ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారు?.. ముందస్తు కక్షలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న మహిళపై బహిరంగ ప్రదేశంలోనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.