
Producer Council Elections: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టాలీవుడ్ ప్రముఖుల సందడి కనిపించింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో గంటలో పోలింగ్ భారీగా నమోదైనట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు డి.వి.వి.దానయ్య, సురేష్ బాబు, అశ్వినీదత్, స్వప్న దత్ పోలింగ్ కేంద్రానికి వచ్చి లైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నిర్మాతలు అంబికా కృష్ణ, వల్లూరిపల్లె రమేష్ బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి కూడా ఓటు వేశారు.
బెల్లంకొండ సురేష్ కుటుంబం కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక యువ హీరోలు సుధీర్ బాబు, ఆర్యన్ రాజేష్, శివ బాలాజీ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు వేశారు. డైరెక్టర్ మారుతి, నిర్మాత బన్నీ వాసు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, అభిషేక్ నామా కూడా పోలింగ్లో పాల్గొని ఓటు వేశారు. టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు స్వయంగా పోలింగ్ కేంద్రానికి తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రం వద్ద నిర్మాతలు, సినీ ప్రముఖుల రాకతో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది.