
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త నిబంధనలను రూపొందిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్టాల సవరణ చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 28 నుంచే ఈ చట్ట సవరణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ జీవో 210ను విడుదల చేయగా.. మేయర్ , కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ మరో జీవో 211ను జారీ చేసింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్ డిపాజిట్ ధరలను నిర్ణయించారు.
జనరల్ కేటగిరీ అభ్యర్థులకు డిపాజిట్ మొత్తాన్ని రూ. 5,000గా, ఎస్సీ, ఎస్టీ , బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ. 2,500గా ఖరారు చేశారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను మాత్రమే దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు.
అభ్యర్థుల పారదర్శకతను పెంచేందుకు గాను నామినేషన్ సమయంలో తమపై ఉన్న నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటరీ అఫిడవిట్ను సమర్పించడం తప్పనిసరి చేశారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత కఠినంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిబంధనలను అమలులోకి తెస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘించినా లేదా అక్రమాలకు పాల్పడినా సదరు ఓటును రద్దు చేసే అధికారాన్ని ప్రిసైడింగ్ అధికారికి కల్పించారు. పరిస్థితిని బట్టి బ్యాలెట్ పేపర్ను వెనక్కి తీసుకునే సర్వాధికారాలు కూడా అధికారులకే అప్పగించారు.
మరోవైపు అంధులు, వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా సహాయకుడిని వెంట తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే సదరు సహాయకుడికి 18 ఏళ్లు నిండి ఉండాలని, అలాగే ఒక వ్యక్తి కేవలం ఒక ఓటరుకు మాత్రమే సహాయకుడిగా ఉండాలనే కఠిన నిబంధనను విధించారు. ఈ నూతన సంస్కరణల ద్వారా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిష్పాక్షికంగా మరియు సజావుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.