
ఒకప్పుడు తమ సరిహద్దుల్లోనే ఉన్నట్టుగా కనిపించిన రెండు యుద్ధాలు ఇప్పుడు బయటకు చిమ్ముతున్న నిప్పురవ్వల్లా మారుతున్నాయి. ఒకటి రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం. మరొకటి అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణ. ఈ రెండు మంటల మధ్య ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం అక్కడి నగరాలు, సరిహద్దులు, యుద్ధభూములకే పరిమితం కావడం లేదు. ఆగస్టు 26 నుంచి రష్యా తమ కీలక మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగిస్తోందని యుక్రెయిన్ చెబుతోంది.
సెప్టెంబర్ 1న కీవ్లోని ఒక రైల్వే డిపోపై బాలిస్టిక్ క్షిపణి పడటంతో ఆరుగురు రైల్వే ఉద్యోగులు మరణించారు. అదే సమయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరో తీవ్రమైన హెచ్చరిక చేశారు. రష్యా గగనతలం కూడా ఇక సురక్షితంగా ఉండకపోవచ్చని చెప్పారు. రష్యా భూభాగంలో యుక్రెయిన్ డ్రోన్ల దాడులు పెరుగుతున్న కొద్దీ అక్కడి మీదుగా ప్రయాణించే విమానాలకు కూడా ప్రమాదం పెరగవచ్చని హెచ్చరించారు.
ఈ మాటలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించారు. జెలెన్స్కీ వ్యాఖ్యలను స్టేట్ టెర్రరిజం ప్రకటనగా అభివర్ణించారు.
ఇంతలో యుద్ధపు నీడ యూరప్ వైపు పడింది. ఆగస్టు 4న లైప్జిగ్ విమానాశ్రయంలో జరిగిన డ్రోన్ దాడి ప్రయత్నం వెనుక రష్యా ఉందని జర్మనీ ఆరోపించింది. ఈ ఘటనలో యుక్రెయిన్కు చెందిన కార్గో విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు జర్మనీ చెబుతోంది. రష్యా యూరప్లో గూఢచర్యం, సైబర్ దాడులు, విధ్వంస చర్యల ద్వారా చేస్తున్న హైబ్రిడ్ వార్లో ఇదొక భాగమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడే విషయం మరింత ప్రమాదకరంగా మారుతోంది. జర్మనీకి మద్దతుగా నాటో నిలిచింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, జర్మనీకి పూర్తి సంఘీభావం ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ కూడా రష్యాపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతోంది. అంటే యుక్రెయిన్ నేలపై మొదలైన యుద్ధం, నెమ్మదిగా నాటో దేశాల తలుపుల వరకు తన నీడను చాపుతోంది.
అదే సమయంలో వెస్ట్ఏషియాలో మరో మంట మళ్లీ ఎగిసింది. ఒక నెలపాటు అమెరికా, ఇరాన్ మధ్య పెద్ద సైనిక ఘర్షణ లేకపోవడంతో ప్రపంచానికి కొంత ఊపిరి వచ్చింది. కానీ సెప్టెంబర్ 1న అమెరికా మళ్లీ ఇరాన్పై దాడులు ప్రారంభించింది.
ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడికి దిగింది. సెప్టెంబర్ 3న కువైట్, జోర్డాన్లోని అమెరికా స్థావరాలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత తీవ్రమైన దాడి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తుండగా, ఇరాన్ సైన్యం అమెరికాపై మరింత విధ్వంసకర దెబ్బలు కొడతామని హెచ్చరించింది. ఒకవైపు యూరప్లో రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం నాటో సరిహద్దుల వైపు ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు వెస్ట్ఏషియాలో అమెరికా, ఇరాన్ మళ్లీ నేరుగా ఢీకొంటున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఒక చిన్న డ్రోన్ దాడి పరిస్థితిని ఒక్కసారిగా మార్చేయగలదు. ఇప్పటివరకు ఈ రెండు యుద్ధాలు ప్రపంచ శక్తుల మధ్య పూర్తిస్థాయి ప్రత్యక్ష యుద్ధంగా మారలేదు. కానీ ఆ యుద్ధాలను అదుపులో ఉంచిన సరిహద్దులు మాత్రం క్రమంగా మసకబారుతున్నాయి.
అందుకే ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న భయం ఒక్కటే. ఈ రెండు యుద్ధాల మంటలను చల్లార్చడానికి నీళ్లు సరిపోతాయా? లేదా ఇప్పటివరకు యుద్ధభూముల మధ్యే ఎగిరిన నిప్పురవ్వలు, చివరికి ప్రపంచం మొత్తానికి అంటుకుంటాయా? ఏమో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి.