Reading Time: < 1 minute
Shruti Haasan Ai Fake Video Case Court Deepfake

Shruti Haasan: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రూపొందిస్తున్న మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ఎండార్స్‌మెంట్లు, తప్పుడు కంటెంట్‌పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌కి సంబంధించిన కేసులో తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇలాంటి కృత్రిమ కంటెంట్ వ్యక్తిగత ప్రతిష్ఠ, గుడ్‌విల్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని స్పష్టం చేసింది. జస్టిస్ మాధవ్ జమ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం.. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన వీడియోలు, తప్పుడు ప్రకటనలు ఒక వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీస్తే, ఆ నష్టాన్ని కేవలం డబ్బుతో పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న ఇమేజ్, వ్యక్తిగత గౌరవం, విశ్వసనీయతకు కలిగే నష్టం మరింత తీవ్రమైనదని పేర్కొంది.

ఈ సందర్భంగా వ్యక్తిగత గోప్యత, గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులను కూడా కోర్టు ప్రస్తావించింది. ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతడి లేదా ఆమె ముఖం, పేరు, గుర్తింపును ఉపయోగించి తప్పుడు కంటెంట్ సృష్టించడం వల్ల కలిగే పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. తాజా కోర్టు తీర్పుపై శృతి హాసన్ అభిమానులు, సినీ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ యుగంలో AI సాంకేతికత దుర్వినియోగాన్ని అడ్డుకునే దిశగా దీనిని కీలక ముందడుగుగా పలువురు అభివర్ణిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే ఇతర ఆర్టిస్ట్‌లకు కూడా ఈ తీర్పు ఉపయోగపడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఫేక్ వీడియోలు, డీప్‌ఫేక్‌లు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యక్తుల గౌరవం, గోప్యతను కాపాడేందుకు మరింత కఠినమైన చర్యలు అవసరమనే చర్చకు ఈ తీర్పు మరింత బలం చేకూర్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.